
సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారిగా సూర్య అరవింద్
తుని: తమిళనాడులోని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారిగా తునికి చెందిన డాక్టర్ కాదంబరి సూర్య అరవింద్ నియమితులయ్యారు. ఆయన సోదరుడు కాదంబరి రామకృష్ణ ఈ విషయం తెలిపారు. అరవింద్ చిన్నప్పటి నుంచీ ఆధ్యాత్మిక చింతన, భక్తి భావనతో ఉండేవాడని, ఎంబీబీఎస్ చదివి, శ్రీ సిద్ధేశ్వరి పీఠంలో చేరారని చెప్పారు. భక్తిశ్రద్ధలతో సేవలందించిన అరవింద్కు పీఠాధిపతి, జగద్గురువు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి.. దత్తేశ్వరానంద భారతి స్వామిగా సన్యాస నామం ఇచ్చి, ఉత్తరాధికారిగా నియమించారని వివరించారు. ఈ నెల 6న కుర్తాళంలో ఆయన పట్టాభిషేకం జరుగుతుందని తెలిపారు.
పీఎం సూర్యఘర్కు సహకరించాలి
కాకినాడ సిటీ: పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారుల ఇళ్లపై సోలార్ రూఫ్టాప్ ప్యానల్ ఏర్పాటుకు అధికారులు, బ్యాంకర్లు చొరవ చూపాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశించారు. వివిధ అంశాలపై కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పీఎం సూర్యఘర్ పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ సకాలంలో సోలార్ రూఫ్టాప్ ప్యానల్ ఏర్పాటు చేయాలన్నారు. సోలార్ రూఫ్టాప్ ప్యానల్ ఏర్పాటుకు బ్యాంకర్ల ద్వారా రుణ మంజూరులో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీనికోసం జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, వారం వారం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ప్రక్రియ సజావుగా సాగేలా చూస్తామని చెప్పారు. మండలాలు, పట్టణాల వారీగా సోలార్ రూఫ్టాప్ ప్యానెల్ ఏర్పాటు చేసే వారితో డీఆర్డీఏ, మెప్మా సిబ్బంది సమన్వయం చేసుకొని, లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ జి.ప్రసాద్, డీఆర్డీఏ పీడీ జి.శ్రీనివాసరావు, ఎల్డీఎం సీహెచ్ఎస్వీ ప్రసాద్ పాల్గొన్నారు.