
వెన్నుపోటుపై పోరుబాట
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఊరూ వాడా ఒక్కటైంది. గద్దె నెక్కి ఏడాదైనా ఇచ్చిన హామీలు అమలు చేయని కూటమి సర్కార్పై జనాగ్రహం పెల్లుబికింది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపునందుకున్న జనం పార్టీలు, వర్గాలు, కులాలకు అతీతంగా చంద్రబాబు కూటమి పాలనపై గళమెత్తారు. ఎన్నికల్లో వందకు పైబడే పథకాలు పేరు చెప్పి ఓట్లు వేయించుకుని తమను మోసం చేయడానికి అధికారం ఇచ్చామా అని జనం వెన్నుపోటు దినంలో నిలదీశారు. ప్రభుత్వంపై ఏడాది కాలంగా ఉన్న ప్రజా వ్యతిరేకత బుధవారం జరిగిన వెన్నుపోటు దినంలో ప్రస్ఫుటమైంది.
పల్లెలు, పట్టణాల నుంచి ఉదయం 10 గంటలకే పార్టీ జెండాలు, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంతో కూడిన ప్లకార్డులతో జనం తండోపతండాలుగా తరలివచ్చి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన పిలుపులో భాగస్వాములయ్యారు. మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు పార్టీ జెండాలు చేతపట్టి పార్టీ కార్యాలయాల నుంచి భారీ బైక్ర్యాలీలు, పాదయాత్రలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడికక్కడే ఉదయాన్నే స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావడంతో వెన్నుపోటు దినం కార్యక్రమం జిల్లా అంతటా సూపర్ సక్సెస్ అయ్యింది. పార్టీ శ్రేణులలో ఉత్సాహం ఉరకలు వేసింది.
కాకినాడ రూరల్
సర్పవరం జంక్షన్లో మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జన సందోహంతో నిరసన ర్యాలీ నిర్వహించారు.అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు.
తుని
పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో తునిలో నిరసన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. పల్లెల నుంచి వేలాదిగా తరలివచ్చిన జన సందోహంతో తుని పట్టణం కిక్కిరిసిపోయింది. తుని పట్టణంలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొబ్బరికాయకొట్టి కాలినడకన ప్రారంభించిన నిరసన ర్యాలీ బాలాజీ సెంటర్, మెయిన్రోడ్డు, గొల్లప్పారావు సెంటర్, తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. పార్టీ నాయకులు యనమల కృష్ణుడు, లాలం బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
జగ్గంపేట
మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో జగ్గంపేటలో వెన్నుపోటు దినం భారీ ర్యాలీలో నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నాయి. జగ్గంపేట కోనేటి వద్ద నుంచి ప్రారంభమై మొయిన్రోడ్డు, బస్టాండ్, పోలీసుస్టేషన్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్, చంద్రబాబు వెన్నుపోటు దారుడు, మోసగాడు, ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారంటూ నినాదాలు చేశారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు. రాష్ట్ర యువజన విభాగం సహాయ కార్యదర్శి తోట రాంజీ, పబ్లిసిటీ విభాగం నుంచి రామకుర్తి జగాలు, లీగల్ సెల్ తరఫున గుల్లా ఏడుకొండలు, పెద్దాడ రాజబాబు, రామకుర్తి శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు.
కాకినాడ సిటీ
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని పల వార్డుల నుంచి తరలివచ్చిన జనంతో కలిసి పార్టీ నేతలు నిరసన గళం వినిపించారు. సిటీలో ద్వారంపూడి సహా పార్టీ నేతలు నలుపురంగు షర్టులు, మహిళా నేతలు, సిటీ ప్రెసిడెంట్ సుంకర శివప్రసన్న, రాష్ట్ర మహిళా కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్ తదితరులు నలుపురంగు చీరలతో వినూత్నంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ సెంటర్ నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లి ఆర్డీవో మల్లిబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లి రాజబాబు, మైనార్టీ సెల్ నేతలు బాషా, బషీర్, లీగల్ సెల్ నేతలు పితాని శ్రీనివాస్, ఆదిత్యకుమార్, ప్రచార, ట్రేడ్, బీసీ విభాగాల నేతలు రావూరి వెంకటేశ్వరరావు, చక్రవర్తి, వాసుపల్లి కృష్ణ, మాజీ డిప్యుటీ మేయర్ మీసాల ఉదయకుమార్, సిటీ యూత్ ప్రసిడెంట్ రోకళ్ల సత్యనారాయణ పాల్గొన్నారు.
ప్రత్తిపాడు
పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో ప్రత్తిపాడులో భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కిర్లంపూడిలోని మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఇంటికి వచ్చి ఆయనను కలిశారు. అనంతరం అక్కడి నుంచి నేతలు, పార్టీ శ్రేణులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు కలసి గిరిబాబు ఆధ్వర్యంలో జగపతినగరం, సింహాద్రిపురం, మీదుగా ప్రత్తిపాడు వచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో పార్టీ నేతలతో పాటు సామాన్యులు సైతం స్వచ్ఛందంగా వచ్చి ‘జెండాలను జతకట్టె..జనాలను మడతపెట్టె’, ‘వెన్నుపోటుకు కేరాఫ్ చంద్రబాబు’, ‘ఉచిత బస్సు అమలులో తుస్’, ‘రైతుభరోసా భారీ మోసం’, ‘వెన్నుపోటు బాబుకు వెండి తెరపై చూపిస్తాం అసలు సినిమా’, ‘వెన్నుపోటు సూపర్హిట్’, ‘నెలనెలా రూ.1,500 అన్నావ్’, ‘50 ఏళ్లకే పింఛన్ అన్నావ్ ఓట్లు వేయించుకున్నావ్’ అనే ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొనడం ఆకర్షించింది. పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు, పార్టీ నేతలు వాసిరెడి జమీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు గోళ్ల క్రాంతిసుధాకర్, గొల్లు దివానం, సిగడం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
పెద్దాపురం
సామర్లకోటలో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ముందుగా మోటారు సైకిల్ ర్యాలీ ప్రారంభించగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ప్రసన్నాంజనేయస్వామి ఆలయం నుంచి మండుటెండలో ఆర్డీవో కార్యాలయం వరకు పాదయాత్రగా నాయకులు, కార్యకర్తలు, నేతలు ర్యాలీగా తరలివెళ్లారు. పార్టీ సీనియర్ నేత దవులూరి సుబ్బారావు ఆధ్వర్యంలో పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద కూటమి ప్రభుత్వం వెన్నుపోటుపై నిరసన వ్యక్తం చేసింది. అనంతరం ఆర్డీవో కె శ్రీరమణికి వినతి పత్రం అందజేశారు. పార్టీ రాష్ట్ర అయ్యరక విభాగం అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల ప్రతినిధులు గవరసాని సూరిబాబు, ఎంపీపీలు పెంకే సత్యవతి, బొబ్బరాడ సత్తిబాబు పాల్గొన్నారు.
పిఠాపురం
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురంలో సైతం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వెన్నుపోటు దినం కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి తరలివచ్చిన జనంతో పిఠాపురం ఉప్పాడ సెంటర్ నిండిపోయింది. ప్రధానంగా పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళల ఇచ్చిన ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పిఠాపురం మారుమోగింది. ఉప్పాడ సెంటర్లో ప్రారంభమైన నిరసన ర్యాలీ పాత బస్టాండ్, అంబేడ్కర్ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా తహసీల్దారు కార్యాలయం వరకు సాగింది. తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు వులవకాయల నాగ లోవరాజు, గుబ్బల తులసీకుమార్, పార్టీ జిల్లా మహిళ అధ్యక్షురాలు వర్థినీడి సుజాత, రాష్ట్ర యూత్ సంయుక్త కార్యదర్శి ఉలవల భూషణం, జిల్లా అధికార ప్రతినిధి పెదపాటి రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కారే శ్రీనివాసరావు, కొప్పన శివనాఽథ్ పాల్గొన్నారు.
కూటమి సర్కార్పై
పోటెత్తిన ప్రజాగ్రహం
వైఎస్సార్ సీపీ శ్రేణులతో
కలిసొచ్చిన జన సందోహం
భారీ మోటార్ సైకిల్ ర్యాలీలు
ఉత్సాహంతో ఉరకలెత్తిన పార్టీ శ్రేణులు
కాకినాడ జిల్లాలో
వెన్నుపోటు దినం సూపర్ సక్సెస్