
వంకర పాదాలు సరి చేయొచ్చు
కాకినాడ క్రైం: పుట్టుకతో వచ్చే వంకర పాదాలను సరి చేయవచ్చని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ్ (ఆర్బీఎస్కే) జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ వి.అరుణ తెలిపారు. వరల్డ్ క్లబ్ ఫుట్ డే సందర్భంగా కాకినాడ జీజీహెచ్ ఆర్థోపెడిక్ లెక్చర్ గ్యాలరీలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డీఈఐసీ), క్యూర్ ఇండియా సంయుక్త ఆధ్వర్యాన మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ, పుట్టుకతో వంకర పాదాలను గుర్తిస్తే వైద్యులు, సామాన్యులు జీజీహెచ్లో ఉన్న డీఈఐసీకి సిఫారసు చేయాలని సూచించారు. ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డాక్టర్ ఎంపీఆర్ విఠల్ మాట్లాడుతూ, పుట్టిన 21 రోజుల్లోగా చికిత్స అందించగలిగితే వంకర పాదాలు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ నిపుణుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే చికిత్సా విధానాల ద్వారా శిశువు జీవన ప్రమాణాలు మెరుగు పడతాయన్నారు. అవసరానికి అనుగుణంగా టినోటమీ అనే మైనర్ శస్త్రచికిత్స నిర్వహిస్తామని డాక్టర్ విఠల్ అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, తల్లిదండ్రులతో పాటు, క్యూర్ ఇండియా ప్రతినిధులు, డీఈఐసీ సిబ్బంది, ఆర్దోపెడిక్, పీడియాట్రిక్స్, ఫిజియోథెరపీ నిపుణులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం, వరల్డ్ క్లబ్ ఫుట్ డే సందర్భంగా డాక్టర్ విఠల్ కేక్ కట్ చేసి, పిల్లలకు అందించారు.
స్కూటీపై వెళ్తూంటే.. చైన్ లాక్కుపోయారు
కరప: గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై వెంబడించి, విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి తిరిగి వెళ్తున్న మహిళా ఉద్యోగి మెడలోని బంగారు గొలుసు లాక్కుని పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన కొండేపూడి శాంతి శివకుమారి కరప మండలం వేళంగిలోని ఎస్బీఐ బ్రాంచిలో టెంపరరీ వర్కర్గా పని చేస్తున్నారు. ఆమె సోమవారం సాయంత్రం తన స్కూటీపై గొల్లపాలెం వెళ్తూండగా సిరిగలపల్లిలంక గ్రామం దాటిన తర్వాత దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టి, వేగంగా పరారయ్యారు. బాధితురాలు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరప పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ పర్యవేక్షణలో కరప ఎస్సై టి.సునీత కేసు దర్యాప్తు చేస్తున్నారు.