
పీజీఆర్ఎస్కు 439 అర్జీలు
కాకినాడ సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 439 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, జెడ్పీ సీఈఓ వీవీ లక్ష్మణరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, కేఎస్ఈజెడ్ ఎస్డీసీ కేవీ రామలక్ష్మి, సీపీఓ త్రినాథ్ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారులు ప్రతి సోమవారం కలెక్టరేట్కు రానవసరం లేదని, మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీ స్థితిగతులు తెలుసుకోవడానికి 1100 నంబర్కు నేరుగా కాల్ చేయవచ్చన్నారు. అధికారులనుద్దేశించి మాట్లాడుతూ, సక్రమంగా పరిష్కరించని అర్జీలపై రెండు స్థాయిల్లో ఆడిట్ జరిపి, రీ ఓపెన్ చేస్తారని చెప్పారు. అలా ఎక్కువగా అర్జీలు రీ ఓపెన్ చేసిన శాఖ అధికారులకు మెమోలు జారీ చేస్తారని హెచ్చరించారు. అందువలన అర్జీదారు సంతృప్తి చెందే విధంగా అర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.
సముద్ర నాచు సాగును
ప్రోత్సహించాలి
అమలాపురం రూరల్: జిల్లాలో తీరం వెంబడి చెరువు ఆధారిత సముద్రపు నాచు సాగును ప్రోత్సహించాలని, దీనివలన బహుళ ప్రయోజనాలుంటాయని, సహజ పర్యావరణానికి ఇది లాభదాయకమని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో సముద్రపు నాచు సాగు విస్తరణ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై ఆయన సమీక్షించారు. ఈ నాచు ఉత్పత్తులు సేంద్రియ ఎరువులుగా, పశుగ్రాసంగా, చేపలకు, కోళ్లకు మేతగా, కాస్మెటిక్స్ తదితర రంగాల్లో ఉపయోగపడతాయని, పర్యావరణ హితమైన ఉత్పత్తులను అందిస్తుందని వివరించారు. గచ్చకాయలపోర, ఎస్.యానాం, రాజోలు సముద్ర తీర ప్రాంతాల్లో అనువైన ప్రదేశాలను ఆర్డీఓ కె.మాధవి సమన్వయంతో ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో 40 మంది ఔత్సాహిక స్వయం సహాయ సంఘాల మహిళలు, మత్స్యకార సంఘాల ప్రతినిధులతో గ్రూపులు ఏర్పాటు చేయాలన్నారు. వారికి తమిళనాడులోని రామనాథపురం జిల్లా మండపంలో జరుగుతున్న నాచు సాగుపై శిక్షణ ఇప్పించేందుకు విధివిధానాలు మే రెండో తేదీ నాటికి రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో గ్రీన్ క్లైమేట్ ఫండ్ ప్రతినిధి శ్రీహర్ష, జిల్లా మత్స్యశాఖ, అటవీ, కాలుష్య నియంత్రణ మండలి, వ్యవసాయ, ఉద్యాన అధికారులు పీవీ శ్రీనివాసరావు, ఎంవీ ప్రసాదరావు, శంకరరావు, బోసుబాబు, రమణ, ఎల్డీఎం కేశవవర్మ, డీఆర్డీఏ పీడీ జయచంద్ర పాల్గొన్నారు.
సర్వ పృష్ఠ ఆప్తోర్యామ
యాగంతో అనంత ఫలితం
అంబాజీపేట: లోక కల్యాణం కోసం నిర్వహించే యాగాల్లో సర్వ పృష్ఠ ఆప్తోర్యామ యాగం ఎంతో అరుదైనదని, ఇది అనంత ఫలితాలనిస్తుందని ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్కు చెందిన సచ్చిదానంద తీర్థ స్వామి అన్నారు. తొండవరం గ్రామంలో జరుగుతున్న ఈ యాగాన్ని ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ, 60 ఏళ్ల క్రితం వరకూ ఈ ప్రాంతంలో ఇటువంటి యాగం జరగలేదన్నారు. ఎంతో నిష్టాగరిష్టులైన సోమయాజులుకు మాత్రమే ఇటువంటి యాగాలు నిర్వహించే సత్తా ఉంటుందన్నారు, కోనసీమలో ఉద్దండులైన వేద పండితులకు కొదవ లేదన్నారు. శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి ఆశీస్సులతో 2020లో తాను అమరావతి ప్రాంతంలో భారీ ఎత్తున యాగం నిర్వహించానన్నారు. హరిద్వార్లో తెలుగు వారికి నిత్యాన్నదానం చేసేందుకు గౌతమీ నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేశామని, దీనిని గుంటూరుకు చెందిన వాసుదేవశర్మ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇక్కడ ప్రతి రోజూ రెండు మూడు వేల మందికి భోజనం, ఫలహారం అందిస్తున్నామని వివరించారు. రానున్న సరస్వతీ నది పుష్కరాలకు రోజుకు లక్ష మంది వరకూ తెలుగు వారు వచ్చే అవకాశం ఉన్నందున వారికి భోజనం, ఫలహారం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని స్వామీజీ వివరించారు.

పీజీఆర్ఎస్కు 439 అర్జీలు