
సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి
గద్వాల వ్యవసాయం: సబ్సిడీపై అందించే విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్యార్డ్ చైర్మన్ హనుమంతు సూచించారు. సోమవారం గద్వాల సింగిల్విండో కార్యాలయంలో సబ్సిడీపై అందించే జీలుగ విత్తనాల విక్రయ కార్యక్రమాన్ని పీఏసీఎస్ చైర్మన్ సుభాన్తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 30 కేజీల జీలుగ విత్తనాలను సబ్సిడీ ధరపై రూ. 2,137.50 ఇస్తుందని తెలిపారు. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీఏసీఎస్ చైర్మన్ సుభాన్ మాట్లాడుతూ పచ్చిరొట్టె ఎరువు వాడటం వల్ల పంటకు పోషకాలు అందుతాయని, నేల గుల్ల బారి నీటిని నిలుపుకొనే సామర్థ్యం పెరిగి, వేరు వ్యవస్థ భూమిలోకి పటిష్టంగా పెరుగుతుందన్నారు. దీంతో పాటు భూమిలో నత్రజని శాతం పెరుగుతుందన్నారు. అనంతరం పలువురు రైతులకు సబ్సీడీ జీలుగ విత్తనాలను అందజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రతాప్కుమార్, పీఏసీఎస్ సీఈఓ వెంకటేశ్వర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.