
భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్ల పాత్ర కీలకం
గద్వాల: లెసెన్స్ సర్వేయర్లతో భూవివాదాలకు పరిష్కారం దొరకడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక పాత ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి భూమి హక్కుల రికార్డు చట్టం–2025ను అమలులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. భూ యజమానులైన రైతులకు మెరుగైన సేవలను అందించే ప్రణాళికలో భాగంగా లైసెన్స్ పొందిన సర్వేయర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. భూభారతి చట్టం ప్రకారం భూమి రిజిస్ట్రేషన్, ముటేషన్, తదితర వాటిలో తప్పనిసరిగా సర్వే చేసి మ్యాప్ జత చేయాల్సి ఉంటుందని దీనికోసం లైసెన్స్ సర్వేయర్లను ఎంపిక చేసి వారికి ప్రభుత్వం శిక్షణ అందిస్తుందన్నారు. మే 26వ తేదీ నుంచి 50రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈశిక్షణ కార్యక్రమంలో థియరీతో పాటు, ఫీల్డ్ట్రైనింగ్ కూడా ఉంటుందన్నారు. అదేవిధంగా శిక్షణ కాలంలో సెలవులు ఇవ్వరని అందరూ కూడా తప్పకుండా హాజరు కావాలన్నారు. అందులో ఉత్తీర్ణులైన వారికి లైసెన్స్డ్ సర్వేయర్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుందన్నారు. అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకుని సూచించారు. కార్యక్రమంలో సర్వేయర్ ఏడీ రామ్చందర్ తదితరులు పాల్గొన్నారు.