
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
గద్వాల/ఇటిక్యాల: భూ సమస్యలను సత్వరం పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ఇటిక్యాల మండలంలోని సాతర్లలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులలో కూడిన బృందాలు రెవెన్యూ సదస్సులో అందుబాటులో ఉంటూ భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తారని, ఈ సదస్సుల్లో ఎలాంటి ఫీజు లేకుండా రైతులు తమ హక్కుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చుని తెలిపారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరీశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తర్వాత నిర్ణీత గుడువులోగా సమస్కలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. రైతులు, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సదస్సులో ఆర్డీఓ శ్రీనివాన రావు, తహశీల్దార్లు వీర భద్రప్ప, నరేష్, డి.టి. నందిని, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
మార్పుకోసం ప్రతిఒక్కరు కృషి చేయాలి
సమాజంలో మార్పు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ కార్యాలయ ఆవరణలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రెడ్క్రాస్ వ్యవస్థాపకులు సర్ జీన్ హెన్రీడ్యూనాంట్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్ జీన్ హెన్రీడ్యూనాంట్ చేసిన మానవతా సేవలు, అపూర్వకృషికి గుర్తుగా మొదటగా నోబెల్శాంతి బహుమతి ఆయనకు లభించిందన్నారు. రెడ్క్రాస్ సంస్థ విశ్వవ్యాప్త మానవతా ఉద్యమానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. విపత్తుల సమయంలో సహాయ సహకారాలు రక్తదానం, ఆరోగ్యసంరక్షణ, విపత్తు సంసిద్ధత తదితర రంగాల్లో సంస్థ చేపడుతున్న సేవలు గొప్పవని కొనియాడారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ రమేష్, సభ్యులు అయ్యప్పురెడ్డి, రవికుమార్, అక్బర్బాషా, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.