
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
ఇటిక్యాల: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు భూ భారతి చట్టంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఇటిక్యాల మండలం వావిలాల గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ హాజరై రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు తహసీల్దార్, ఆర్డీఓ లేదా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం అధికారులే స్వయంగా గ్రామాలకు వచ్చి భూ సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నారని తెలిపారు. వావిలాల గ్రామంలో వివిధ రకాల భూ సమస్యలపై 49 అర్జీలు అందాయని.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నెల రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, తహసీల్దార్లు వీరభద్రప్ప, నరేష్, ఎంపీడీఓ అజార్ మొహినుద్దీన్, ఏఓ రవికుమార్, రెవెన్యూ సిబ్బంది మనోహర్, నరేష్, మదన్మోహన్, సర్వేయర్ దౌలమ్మ, పంచాయతీ కార్యదర్శి శంకర్ పాల్గొన్నారు.
డయాగ్నొస్టిక్ సెంటర్లలో తనిఖీలు
గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ల్యాబ్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లలో మంగళవారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. బయో మెడికల్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని.. ప్రైవేటు ల్యాబ్లు, డయాగ్నొస్టిక్ సెంటర్ల నిర్వాహకులు తప్పనిసరిగా బీఎండబ్ల్యూ నిబంధనలు పాటించాలని జిల్లా ప్రోగ్రాం అధికారిణి ప్రసూన్నరాణి సూచించారు. ఈ తనిఖీల్లో అధికారులు మధుసూదన్రెడ్డి, నర్సయ్య తదితరులు ఉన్నారు.
ముగిసిన
ఆరాధనోత్సవాలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న శేషదాసుల వారి ఆరాధనోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున శేషదాసుల వారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పండితులు రాఘవేంద్రాచారి, రమేషాచారి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మెలగాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ.. సన్మార్గంలో పయనించాలన్నారు. అనంతరం సంగీత కచేరి చేశారు. హరినామ సంకీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, దీరేంద్రదాసు, రాఘవేంద్రదాసు, శశాంక్, విష్ణు, అరవిందరావు, బాబురావు, భీంసేన్రావు, మనోహర్రావు, రామారావు, శ్రావణ్, రవిచారి తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం