కష్టపడి కాదు.. ఇష్టపడి చదవాలి | - | Sakshi
Sakshi News home page

కష్టపడి కాదు.. ఇష్టపడి చదవాలి

May 7 2025 12:32 AM | Updated on May 7 2025 12:32 AM

కష్టపడి కాదు.. ఇష్టపడి చదవాలి

కష్టపడి కాదు.. ఇష్టపడి చదవాలి

ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలి

కలెక్టర్‌ బీఎం సంతోష్‌

‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన

గద్వాల: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు కష్టపడి కాకుండా.. ఇష్టపడి చదువుకోవాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో 550 మార్కులకు పైగా సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలకు చెందిన 34 మంది విద్యార్థులను మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్‌ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 32వ స్థానంలో నిలవగా.. తాజాగా విడుదలైన ఫలితాల్లో 10.36 శాతం పెరుగుదలతో ఉత్తమ ఫలితాలు సాధించి 26వ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరాలంటే.. క్రమశిక్షణ, కష్టపడేతత్వం ఉండటంతో పాటు తమపై తమకు పూర్తి నమ్మకం ఉండాలని సూచించారు. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు నిరంతర కృషి అవసరమన్నారు. విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ దశ కీలకమని.. భవిష్యత్‌కు దిశను నిర్ణయిస్తుందన్నారు. ఈ సమయంలో మరింత పట్టుదల, క్రమశిక్షణతో కూడిన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. హార్డ్‌ వర్క్‌తో పాటు స్మార్ట్‌ వర్క్‌ కూడా చాలా అవసరమన్నారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండి.. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కలెక్టర్‌ సూచించారు. రోజు వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం మెస్‌ చార్జీలను కూడా 40 శాతం పెంచిందని.. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషిచేసిన ఉపాధ్యాయులకు కలెక్టర్‌ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ అబ్దుల్‌ ఘని, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement