
గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలి
రాజోళి: కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు సంబంధిత అధికారులకు సూచించారు. రాజోళి మండలం పచ్చర్ల గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గన్నీ బ్యాగుల కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నామని రైతులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. రైతులకు సరిపడా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు నసనూరు, పెద్ద ధన్వాడ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ప్రతి కూలీకి రూ.300 కూలి అందే విధంగా పనులు చేపట్టాలని సూచించారు. అదే విధంగా పచ్చర్లలో ఉపాధి హామీ పథకంలో నిర్మిస్తున్న నాలుగు పశువుల పాకలు, ఎరువు గుంతలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ ఖాజామొయినుద్దీన్, ఏపీఓ ప్రసాద్, ఏపీఎం మార్తమ్మ తదితరులు ఉన్నారు.