భూ భారతితో అన్ని సమస్యలకు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూ భారతితో అన్ని సమస్యలకు పరిష్కారం

Apr 22 2025 1:14 AM | Updated on Apr 22 2025 1:14 AM

భూ భారతితో అన్ని సమస్యలకు పరిష్కారం

భూ భారతితో అన్ని సమస్యలకు పరిష్కారం

అలంపూర్‌/ ఉండవెల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో అన్నిరకాల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎంపీ మల్లు రవి అన్నారు. అలంపూర్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో, ఉండవెల్లిలోని రైతువేదికలో భూ భారతి చట్టంపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎంపీతోపాటు కలెక్టర్‌ బీఎం సంతోష్‌, ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతిగా భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం తీసుకొచ్చారన్నారు. గతంలో ధరణి పోర్టల్‌తో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, కార్యాలయాల చుట్టు కాళ్లు అరిగేలా తిరిగినా పరిష్కారం చూపేవారు కాదన్నారు. ఈ దుస్థితిని మార్చడానికి, పేద రైతుల కన్నీళ్లను తుడిచేందుకు భూ భారతి చట్టం రూపొందించామన్నారు. ప్రభుత్వం అన్ని కోణాల్లో మేధోమథనం చేసి సమగ్ర అంశాలతో భూ భారతి చట్టానికి రూపకల్పన చేసిందన్నారు. ప్రతి వారం కలెక్టర్‌, తహసీల్దార్‌ సహా సంబంధిత అధికారులతో సమీక్ష జరిపి భూ సమస్యల పరిష్కారంపై పర్యవేక్షణ చేస్తామన్నారు. కలెక్టర్‌ సంతోష్‌ మాట్లాడుతూ ధరణి స్థానంలో కొత్తగా భూ భారతి వ్యవస్థ అమల్లోకి వచ్చిందని, భూ భారతి చట్టంలో 23 సెక్షన్లు, 18 నిబంధనలు ఉన్నట్లు చెప్పారు. ముందుగా తహసీల్దార్‌ స్థాయిలో దరఖాస్తు చేసుకోవచ్చని, అక్కడ న్యాయం జరగకపోతే ఆర్డీఓ, కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉందన్నారు. భూ భారతితో భూమికి సంబంధించిన సమస్యలు జిల్లా స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చన్నారు. వారసత్వ మ్యుటేషన్‌, హక్కుల సంక్రమణ గడువులోపు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. భూమి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌కు ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్‌ తయారు చేయాల్సి ఉంటుందన్నారు. ఆధార్‌ తరహాలో భవిష్యత్‌లో భూములకు సంబంధించి సర్వే చేసి, హద్దులు, కొలతలు, భూముల వివరాలు ఒకే పుస్తకంలో ఉండేలా భూధార్‌ రూపొందించనున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ గ్రామాల ప్రజలు భూ భారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీనివాసులు, అలంపూర్‌ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ దొడ్డప్ప, తహసీల్దార్‌ మంజుల, మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, రైతులు పాల్గొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ

నిధులతో అభివృద్ధి

అలంపూర్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అలంపూర్‌ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తానని ఎంపీ మల్లు రవి అన్నారు. సోమవారం ఆయన ఆలయాన్ని సందర్శించగా.. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మ, స్వామివార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శక్తిపీఠం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడతానన్నారు. అలంపూర్‌ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించడానికి కృషి చేస్తానన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement