
బెట్టింగ్ భూతం..!
ఈజీమనీ ఆశతో రూ.లక్షలకు లక్షలు బెట్టింగ్
గద్వాల క్రైం: ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అన్న యువత అత్యాశను కొన్ని బెట్టింగ్ యాప్ నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. యువతకు మొదట్లో డబ్బు వస్తున్నట్లు ఆశ చూపించి.. బెట్టింగ్ ఊబిలోకి దింపడం.. తీరా రూ.వేల నుంచి రూ.లక్షలు బెట్టింగ్ వేశాక కోరుకోలేని దెబ్బతీస్తున్నారు. అటు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక.. వారి ఒత్తిళ్లు భరించలేక.. కుటుంబసభ్యులకు ఏం చేప్పుకోవాలో తెలియక జిల్లాలో వారం రోజుల్లో ఇద్దరు యువకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం కావడంతో నడిగడ్డలో ఆన్లైన్ బెట్టింగ్లకు శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్లు మొబైల్స్ రాకతో పట్టణ, గ్రామీణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో పందెం ఆట విడుపుగా మారింది. పందెంలో వేసిన డబ్బులు పోగుట్టుకున్న వారంతా అప్పులు చేసి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు.
జిల్లాలోని ఘటనలు
● ఈ ఏడాది మార్చి 30న జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు(25) ఆన్లైన్లో క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్లు వేస్తు రూ.6లక్షలు అప్పు చేశాడు. అప్పు ఇచ్చిన వ్యక్తులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఓ కారును తాకట్టు పెట్టి కొంత మేర అప్పు తీర్చాడు. అయినప్పటికీ మిగతా అప్పు చెల్లించాల్సిందిగా ఒత్తిడి తేవడంతో తల్లిదండ్రులను డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇదే మొదటిసారి కాదు డబ్బులు ఇవ్వడం అంటూ కుటుంబ సభ్యులు మందలించడంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందాడు. ఈఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
● ఈ నెల 5వ తేదీన గద్వాల మండలానికి చెందిన ఓ యువకుడు(22) ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ ఆన్లైన్లో బెట్టింగ్లు వేశాడు. బెట్టింగ్ ఓడిపోవడంతో వారికి డబ్బు చెల్లించేందుకుగాను తెలిసిన వ్యక్తుల ద్వారా రూ.50వేలు అప్పు తీసుకున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వారు మందలించారు. దీంతో కలత చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
● జూన్ 2.2023 జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు క్రికెట్ బెట్టింగ్లో రూ. 70లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తులు ఒత్తిడి చేయడంతో అప్పులు చెల్లించే స్థోమత లేకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతోపాటు క్రికెట్ బెట్టింగ్లో ప్రముఖులు సైతం రూ.కోట్ల పోగొట్టుకున్నారు. కొందరు అప్పులు చెల్లించే దుస్థితి లేకపోవడంతో జిల్లా విడచి పారిపోయారు. ఏజెంట్లపై గద్వాల, శాంతినగర్, రాజోళి, అయిజ, ఉండవెల్లి తదితర పోలీసు స్టేషన్లో కేసులు నమోదు చేశారు.
బెట్టింగ్లకు దూరంగా ఉండాలి
క్రికెట్, ఇతర బెట్టింగ్లకు ప్రజలు, ముఖ్యంగా యువత దూరంగా ఉండాలి. ఇలా బెట్టింగ్లకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లో సిబ్బందికి దిశానిర్ధేశం చేశాం. తల్లిదండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలి. అధికంగా డబ్బు ఖర్చు చేస్తున్నారంటే అనుమానించాల్సిందే. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే సైబర్క్రైం వెబ్సైట్, లేదా టోల్ ఫ్రీ నంబర్ 1930, డయల్ 100కు ఫిర్యాదు చేయాలి. – శ్రీనివాసరావు, ఎస్పీ
చేసిన అప్పులు తీర్చలేక మానసిక
ఒత్తిడితో యువత సతమతం
జిల్లాలో వారం రోజుల్లో
ఇద్దరి బలవన్మరణం
మాయాజాలం
టీవీలలో క్రికెట్ చూస్తూ టాస్ మొదలుకుని, వికెట్ల చొప్పున, బంతి, బంతికి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. మ్యాచ్లో తలపడే జట్టులో ఫలానా జట్టు టాస్ గెలుస్తుందని, ఫలానా జట్టు బ్యాటింగ్ తీసుకుంటుందని బెట్టింగ్ చేస్తారు. ఈ బెట్టింగ్లో ఒకటికి రెండింతలు చెల్లించే పద్ధతిని పాటిస్తారు. మొదటి ఓవర్లో వికెట్ పడుతుందని, సిక్సర్ కొడ్తారనే బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. తర్వాతి ఓవర్లలో బంతి, బంతికి... ఫోర్, సిక్సర్ కొడతారని, వికెట్ పడుతుందని, ఎక్స్ట్రా రన్ వస్తుందని, రివ్యూ ఛాయిస్ తీసుకుంటారంటూ పలు రకాలుగా బెట్టింగ్లు చేస్తారు. ఒక్కో సందర్భంలో బెట్టింగ్కు పాల్పడే మొత్తానికి 5 నుంచి 10 రెట్ల వరకు బెట్టింగ్లకు పాల్పడుతున్నారు.

బెట్టింగ్ భూతం..!