అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ క్షేత్రాన్ని మంగళవారం ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలను అందజేసి అశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. ఆయన వెంట ఆలయ మాజీ ధర్మకర్త నీలప్ప, కడప డివిజన్ ఎస్డీఎం రవికుమార్, రాయచూరు ఎస్డీఎం వైవీ రావు, ఎంఎంలు శ్యాంసుందర్, చిరంజీవి ఉన్నారు. అదే విధంగా సీరియల్ నటి జ్యోతిరెడ్డి అలంపూర్ క్షేత్రాన్ని సందర్శించి జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
ఎన్ఎల్ఎంతో
తక్కువ వడ్డీకే రుణాలు
అయిజ: నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా రైతులకు తక్కువ వడ్డీకే ఎక్కవ మొత్తంలో రుణాలు అందిస్తున్నట్లు నాబార్డ్ తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ జనరల్ మేనేజర్ బొల్ల శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డీడీఎంలు షణ్ముఖాచారి, మనోహర్రెడ్డి, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ అయ్యపురెడ్డిలతో కలిసి అయిజ సింగిల్విండో కార్యాలయాన్ని సందర్శించారు. సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూపర్ మార్కెట్, ఫెస్టిసైడ్, ఫర్టిలైజర్ దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సింగిల్విండో చైర్మన్ మధుసూదన్రెడ్డితో వివరాలు తెలుసుకున్నారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాల కేటాయింపులు, వాటి అమలు తీరుపై వారు సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతోనే రైతులకు అన్నివిధాలా మేలు చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. నేషనల్ లైవ్స్టాక్ పథకం ద్వారా గొర్రెలు, బర్రెలు, పౌల్ట్రీ తదితర వాటి ఏర్పాటు కోసం రైతులకు తక్కువ వడ్డీ రేట్లకే ఎక్కువ మొత్తంలో రుణాలు అందిస్తామని.. ఇందులో గణనీయమైన సబ్సిడీ కూడా ఉంటుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి మల్లేష్, సిబ్బంది పాల్గొన్నారు.
బార్ అసోసియేషన్
ఎన్నికలకు ఏర్పాట్లు
గద్వాల: గద్వాల బార్ అసోసియేషన్కు 2025–26 సంవత్సరం నూతన అధ్యక్ష, కార్య దర్శులతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షఫి ఉల్లా ఒక ప్రకటనలో తెలిపారు. నూతన కార్యవర్గ ఎన్నికలకు సీనియర్ న్యాయవాది పూజారి శ్రీధర్ను ఎన్నికల కమిషనర్గా నియమించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను ఈ నెల 27వ తేదీలోగా పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిపారు.
బ్రిడ్జి నిర్మాణంలో
నిర్లక్ష్యం తగదు
ధరూరు: మండలంలోని నీలహళ్లి–పాతపాలెం మార్గంలో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం విషయంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్కుమార్ అన్నారు. మంగళవారం బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. 20 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించే బ్రిడ్జి గతేడాది వర్షాకాలంలో వరదలకు కొట్టుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. ఆయన వెంట నడిగడ్డ హక్కుల సంఘం జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, మండల అధ్యక్షుడు గోవిందు, లవన్న, మునెప్ప, ఇస్మాయిల్, రాము, జగదీశ్, జమ్మన్న, ఆంజనేయులు, నాగరాజు, మల్దకల్, ప్రేమ్రాజ్ తదితరులు ఉన్నారు.
జోగుళాంబ సన్నిధిలో ప్రముఖులు
జోగుళాంబ సన్నిధిలో ప్రముఖులు