తెలకపల్లి మండలం ఆలేరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు
గద్వాల టౌన్: మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిదారులకు ఈసారి వడ్డీ మినహాయింపు ఇవ్వకూడదనే ప్రభుత్వ నిర్ణయంగా ఉంది. ఆస్తిపన్ను వడ్డీతో సహా మొత్తం వసూలు చేయాలని ఆదేశాలు ఇస్తున్న ఉన్నతాధికారులు వడ్డీ మాఫీ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో మున్సిపల్ ఉద్యోగులు ఆస్తిపన్నును వడ్డీతో కలిపి వసూలు చేస్తున్నారు. ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారనుంది. దీనికి తోడు పన్ను మొండి బకాయిదారులపై ఇప్పటికే వడ్డీ రెట్టింపు అయ్యింది. ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయి పన్నుల వసూళ్లు, చెల్లింపులు ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆస్తిపన్ను వసూలు గురించి ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఈ నెలాఖరు వరకై నా ప్రభుత్వం వడ్డీ మాఫీ చేస్తుందని బకాయిదారులు ఎదురుచూస్తున్నారు. ఈ వైఖరితో ఈసారి అన్ని మున్సిపాలిటీలు ఆస్తిపన్ను వంద శాతం వసూలు చేస్తాయా.. లేదా.. అనేది సందిగ్ధంగా మారింది. ఒకవైపు ఉన్నతాధికారుల ఆదేశాలు.. మరోవైపు వడ్డీతో కలిపి పన్నులు వసూలు చేయడం మున్సిపల్ సిబ్బందికి ఇబ్బందికరంగానే తయారైంది. మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లపై ప్రభుత్వం కొంతకాలంగా వడ్డీ మినహాయింపు వెసులుబాటు కల్పిస్తోంది. ప్రతి మార్చిలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు విడుదల చేసి ఈ అవకాశాన్ని ఇస్తోంది. ఆస్తిపన్ను బకాయిదారులకు వడ్డీ మినహాయింపు కొంత ఊరటనిచ్చేది. ఆస్తిపన్ను బకాయిదారులపై మున్సిపల్ అధికారులు రెండు శాతం వడ్డీ విధిస్తారు. ఏడాది పొడవునా వివిధ కారణాలతో చెల్లించని ఆస్తిపన్ను బకాయిదారులకు వడ్డీ మినహాయింపుతో కొంత తగ్గడంతోపాటు మున్సిపాలిటీలకు సైతం ఆస్తిపన్ను పూర్తిస్థాయిలో వసూలయ్యేది. కానీ, ఈ ఏడాది ప్రభుత్వం ఆస్తిపన్నుపై వడ్డీ మినహాయింపు ఇవ్వకపోవడంతో వందశాతం వసూలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మార్గదర్శకాలు జారీ..
మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో వంద శాతం చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత మున్సిపల్ అధికారులు ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఆస్తిపన్నుతోపాటు లైసెన్స్, నీటి పన్ను, ప్రచార పన్నుల వసూళ్లను వేగిరం చేసేందుకు మార్గదర్శకాలను కూడా సూచించారు. ఈ మేరకు జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు ఆదేశాలు అందాయి.
● మున్సిపాలిటీలోని వివిధ విభాగాల్లో పనిచేసే అధికారుల పర్యవేక్షణలో బిల్ కలెక్టర్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్, వార్డు ఆఫీసర్లతో బృందాలను ఏర్పాటు చేయాలి.
● ఒక్కో బృందానికి రోజువారి లక్ష్యాలను కేటాయించి.. వసూళ్ల తీరు సమీక్షించాలి.
● మైకులు, కరపత్రాలతో బకాయి పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని ప్రచారం చేయాలి.
● ఒక్కో బిల్ కలెక్టర్ పరిధిలో బకాయిలు పడిన 500 మంది జాబితాను తయారు చేసి వసూలుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
● బకాయిల వసూళ్లలో బిల్లు కలెక్టర్ 85 శాతం, ప్రత్యేక బృందాలు 10 శాతం, కమిషనర్ 5 శాతం వసూలు చేయాల్సి ఉంటుంది.
● ప్రభుత్వ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలపై ఆయా కమిషనర్లు కలెక్టర్ను సంప్రదించి, వసూలయ్యేలా చర్యలు చేపట్టాలి.
● గతేడాదితోపాటు అంతకు ముందు కరోనా కాలంలో ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ మినహాయింపు ఇవ్వడంతో గద్వాలలో 90 శాతానికి పైగా ఆస్తిపన్ను వసూలైంది. వడ్డీ మినహాయింపుతో దాదాపు రూ.20 లక్షలకు పైగా బకాయిదారులకు మేలు జరిగింది. మున్సిపాలిటీకి కొంత నష్టమైనా ఆస్తిపన్ను వసూలై అభివృద్ధికి దోహదపడింది.
ఈసారి ఉండకపోవచ్చు..
ఆస్తిపన్నుపై వడ్డీమాఫీకి సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి రాలేదు. బకాయిలతోపాటు ఆస్తిపన్ను చెల్లించాలి. ఆ దిశగానే వసూళ్లు చేస్తున్నాం. వరుసగా రెండేళ్లపాటు పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. బకాయిలు చెల్లించిన వారికి పెద్ద మొత్తంలోనే రాయితీ వచ్చింది. ఈసారి వడ్డీమాఫీ ఉండకపోవచ్చు. ప్రతిఒక్కరూ పన్ను చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలి.
– దశరథ్, మున్సిపల్ కమిషనర్, గద్వాల
ఈసారి వెసులుబాటు లేనట్లే
వందశాతం వసూలు
చేయాలని ఆదేశాలు
ఆస్తిపన్నుపై వడ్డీ భారమే..
ఆస్తిపన్నుపై వడ్డీ భారమే..