గద్వాలటౌన్: చెత్త, ఇతర వ్యర్థాలను రోడ్ల పక్కన ఇష్టానుసారంగా చెత్త పారవేస్తారో అలాంటి వారిని గుర్తించి జరిమానా విధించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కేంద్రంలో కలియ తిరిగారు. ఆయా వార్డులలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పట్టణంలోని దుకాణాలు, హోటళ్లు, వైన్స్ షాపుల దగ్గర పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయని, వారికి హెచ్చరికలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం విచ్చలవిడిగా ఉందని మండిపడ్డారు. పారిశుద్ధ్య నిర్వహణ పాటించని దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛ గద్వాల లక్ష్యంగా పారిశుద్ధ్య సదుపాయాలు మెరుగుపరిచి, పట్టణ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ దశరథ్, శానిటరి ఇన్స్పెక్టర్ మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.