గద్వాలటౌన్: మహిళలు స్వశక్తితో ఎదిగి ఆర్థిక స్వావలంబన సాధించాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత అన్నారు. జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శనివారం మహిళాలలను, మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళల కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ, వారిని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాయని చెప్పారు. స్వశక్తితో ఎదగాలనే సంకల్పం ఉంటే మహిళలు ఏదైనా సాధించగలరని పేర్కొన్నారు. ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశంలోని మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. మహిళా శక్తి ఎదిగినప్పుడే దేశానికి, రాష్ట్రానికి మంచి గుర్తింపు వస్తుందన్నారు. మహిళాభివృద్ధితోనే సమాజాభివృద్ధి ఉందని చెప్పారు. బాల్య వివాహాలను రూపు మాపాలని సూచించారు. ఆడపిల్లలను చదివించాలని, అందుకు తల్లిదండ్రులు మంచి వాతావరణం కల్పించాలన్నారు. అక్షరాస్యతతోనే చాలా వరకు సమస్యలు తొలగిపోతాయని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు వారి హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆడ,మగ పిల్లలను సమాన దృష్టితో ప్రోత్సహించాలన్నారు. ముఖ్యంగా లింగవివక్ష విడాలని పేర్కొన్నారు. శంకర్, జి తిరుమలేష్, నాయకులు కబీర్దాసు అనిత, శారద, సుకన్య, ఇసాక్ పాల్గొన్నారు.