ములుగు: అడవులు, కొండలు, రహదారి సరిగా లేని మారుమూల గ్రామాలు, అడవుల్లో నివాసముంటున్న గొత్తికోయల ఆవాసాలు. దూరప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీ గ్రామాలతో కూడిన జిల్లా ములుగు. ఇక్కడ అత్యవసర వైద్యసేవలు అందించడం సవాల్తో కూడిన సహవాసం. వర్షాకాలంలో పొంగి ప్రవహించే వాగులు, వంకలు, గిరిజన గ్రామాల్లో మొబైల్ సిగ్నల్స్ లేక అవస్థలు పడుతున్న ప్రజలకు ప్రాణాధారంగా నిలుస్తున్నాయి 108 అంబులెన్స్ సిబ్బంది సేవలు. ప్రాంతం ఏదైనా పల్లె ఎక్కడ ఉన్నా.. అత్యవసర సమయాల్లో వచ్చే ప్రతీ కాల్కు స్పందిస్తూ రాత్రింబవళ్లు నిరంతరం సేవలు అందిస్తూ ప్రతీ ప్రాణాన్ని కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తూ పునర్జన్మ ప్రసాదించే ప్రాణదాతలుగా నిలుస్తున్న 108 సిబ్బందిపై సాక్షి ప్రత్యేక కథనం.
10 మండలాలు..14 అంబులెన్స్లు
ములుగు జిల్లా 10 మండలాల పరిధిలోని 171 గ్రామ పంచాయతీలతో పాటు, ములుగు మున్సిపాలిటీ పరిధితో కలిపి 14 అంబులెన్స్ల సిబ్బంది నిరంతరం ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్నారు. 108 అంబులెన్స్లో పైలట్ (డ్రైవర్)తో పాటు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) ఉంటారు. 108కు కాల్ రాగానే సకాలంలో ఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స చేయడం, రోగిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్నారు. 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో అనేక మంది ప్రాణాలు నిలుస్తున్నాయి.
అంబులెన్స్లో ప్రసవాలు అనేకం
డెలివరీ కేసులపై 108 సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. గర్భిణులు నొప్పులు మొదలు కావడంతో కుటుంబసభ్యులు 108కి కాల్ చేయడం, వెంటనే అక్కడకు చేరుకొని ఆస్పత్రికి తరలించే సమయం లేకపోవడంతో అనేక మంది గర్భిణులకు 108 అంబులెన్స్లోనే సిబ్బంది పురుడు పోసి తల్లి, శిశువు క్షేమంగా ఉండేలా వైద్యసేవలు అందిస్తున్నారు. ఏడాదిలో సుమారు 60 మందికి పైగా గర్భిణులకు పురుడు పోసి తల్లీబిడ్డలు క్షేమంగా ఉండేలా సేవలందించారు. రోడ్డు ప్రమాదం జరిగిన, గుండెపోటు వచ్చిన ఆస్పత్రికి వెళ్లేలోపు గోల్డెన్ ఆవర్లో చికిత్స ఎంతో అవసరం, ఈఎంటీ ప్రాథమిక చికిత్స చేస్తే పైలట్ ట్రాఫిక్ సమస్యను దాటుతూ ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని కంటికిరెప్పలా కాపాడుతూ సరైన సమయంలో ఆస్పత్రికి చేర్పించి ప్రాణాలు నిలబెడుతూ వందలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు.
18,886 కేసులకు స్పందన
ప్రమాదం, ప్రసవవేదన, జ్వరం, పాముకాటు, శ్వాస ఇబ్బంది, గుండెపోటు, జబ్బు ఏదైనా సకాలంలో వైద్యం అందకపోతే నిండు ప్రాణాలు గాలిలో కలవక తప్పదు. ఏ అత్యవసర పరిస్థితి అయినా మేమున్నామంటూ.. ఆపదలో ఉన్న ప్రజల ప్రాణాలు రక్షిస్తూ మెరుగైన సేవలందిస్తున్నారు. జిల్లాలో 2025 మార్చి 31 నుంచి ఫిబ్రవరి 28, 2026 వరకు 18,886 కేసులకు స్పందించి వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తూ సకాలంలో ఆస్పత్రికి చేర్చారు. 1,569 రోడ్డు ప్రమాద కేసులు, 2,461 గర్భిణుల కేసులు, 827 మంది సృహ కోల్పోయిన కేసులు, 2,437 కడుపునొప్పి కేసులు, 1,251 శ్వాసకోస సంబంధిత కేసులు, 953 డొమెస్టిక్ ప్రమాదాలు, 932 గుండెనొప్పి సంబంధిత కేసులు, 863 పాయిజన్ కేసులు, 647 ఫిట్స్ కేసులు, 368 ఆత్మహత్యాయత్నం కేసులు, 271 పెరాలసిస్ కేసులు, 445 జంతు దాడి కేసులు, 46 బర్నింగ్ కేసులు, 5,816 ఇతర సంబంధిత కేసులకు సకాలంలో స్పందించి వైద్యసేవలు అందించారు.
పునర్జన్మ ప్రసాదించే ప్రాణదాతలు
ఆపదలో ఆదుకుంటున్న 108 సిబ్బంది
ఏడాదిలో 18,886 కేసులకు స్పందన
అత్యవసర పరిస్థితుల్లో
మెరుగైన వైద్యసేవలు
గిరిజన ప్రాంతంలో ఘనమైన సేవలు


