సర్పంచ్లకు సవాళ్లు
మూడేళ్లుగా పంచాయతీలకు రాని నిధులు
భూపాలపల్లి: కొత్తగా ఎన్నికై న సర్పంచ్లకు గ్రామాల్లో సమస్యల పరిష్కారం సవాల్గా నిలువనున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్నేళ్లుగా నిధులు రాకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ లోపం, విద్యుత్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటికి తోడు ఎన్నికల్లో గెలుపొందేందుకు కొందరు సొంత మేనిఫెస్టోలు రూపొందించుకొని హామీలు గుప్పించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతో ఇచ్చిన హామీలు మరోవైపు మౌలిక సదుపాయాల కల్పన ఎలా చేస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది.
గ్రామాల్లో సమస్యలు విలయతాండవం..
జిల్లాలోని గ్రామాల్లో సమస్యలు విలయతాండవం ఆడుతున్నాయి. గత పాలకవర్గాలు 2019 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 1వ తేదీ వరకు అధికారంలో ఉన్నాయి. ఆ సమయంలో ప్రభుత్వాల నుంచి నిధులు సక్రమంగా రాకపోయినప్పటికీ సర్పంచ్లు చేసేదిలేక వీధి దీపాలు, తాగునీటి బోర్ల మరమ్మతులు చేయించారు. వివిధ పథకాల్లో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటివరకు ఆ బిల్లులు రాకపోవడంతో మాజీ సర్పంచ్లంతా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని గ్రామీణ ప్రాంత జనాభా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మూడేళ్లుగా 15, 16వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. జిల్లాకు ఏడాదికి రూ.15 కోట్ల చొప్పున మూడేళ్లలో రావాల్సిన రూ.45 కోట్ల నిధులు నిలిచిపోయాయి. ఫండ్స్ లేని కారణంగా జిల్లాలోని సగానికి పైగా పంచాయతీల్లో చెత్త సేకరణ ట్రాక్టర్లు మూలన పడి ఉన్నాయి. ఫలితంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వీధి దీపాలు, తాగునీటి బోర్ల విద్యుత్ బిల్లులు భారీ మొత్తంలో పేరుకుపోయి ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. సైడ్ కాలువలు, రోడ్లపై చెత్త పేరుకుపోయి ఉంది. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలను పట్టించుకునే వారే కరువయ్యారు. పలు గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం కొత్త సర్పంచ్లపై ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.
సొంత మేనిఫెస్టో, హామీల అమలు ఎలా..?
జిల్లాలోని 12 మండలాల్లో 248 సర్పంచ్, 2,102 వార్డు స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆయా స్థానాల్లో గెలుపొందిన వారు నేడు(సోమవారం) ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్తగా ఎన్నికైన వారిలో పలువురు సర్పంచ్, వార్డుసభ్యులు ఎన్నికల సమయంలో గెలుపు కోసం సొంత మేనిఫెస్టోలు రూపొందించుకొని హామీలు గుప్పించారు. గ్రామాల్లో కోతులు, కుక్కల బెడద తీర్చడం, వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం, కుల సంఘాలకు భవనాల నిర్మాణం, దేవాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామని హామీలు గుప్పించారు. కొందరైతే ఏకంగా పింఛన్లు మంజూరు చేయిస్తామని, పంట పొలాలకు రహదారులు ఏర్పాటు చేయిస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో గెలుపు కోసం వారి పరిధిలో సాధ్యం కాని హామీలను సైతం ఇచ్చారు. నిధులు లేక ఇప్పటికే సమస్యల వలయంలో ఉన్న గ్రామాల్లో కొత్త సర్పంచ్లు ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారోననే చర్చ గ్రామాల్లో నెలకొంది.
మూలనపడిన చెత్త ట్రాక్టర్లు, పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
పెండింగ్లో భారీగా విద్యుత్ బిల్లులు
చిన్నచిన్న అభివృద్ధి పనులకు సైతం నిధులు కరువు
నేడు కొత్త సర్పంచ్ల ప్రమాణ స్వీకారం
సర్పంచ్లకు సవాళ్లు
సర్పంచ్లకు సవాళ్లు


