సర్వే నంబర్‌ 33 | - | Sakshi
Sakshi News home page

సర్వే నంబర్‌ 33

Jun 24 2025 4:13 AM | Updated on Jun 24 2025 4:13 AM

సర్వే

సర్వే నంబర్‌ 33

రేగొండ: కొత్తపల్లిగోరి మండలంలోని కొనరావుపేట గ్రామ శివారులో సర్వే నంబర్‌ 33లోని అసైన్డ్‌ భూమి వివాదాలకు కేంద్రంగా మారింది. ఈ సర్వే నంబర్‌లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 196 ఎకరాల భూమి ఉంది. కానీ భూమికి మించి అధికంగా పట్టాలు జారీ కావడంతో రైతులు, అన్నదమ్ములు, క్రయవిక్రయదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తహసీల్దార్‌ కార్యాలయంలో ఈ సర్వే నంబర్‌కు సంబంధించిన పిర్యాదులు సర్వసాధారణమయ్యాయి. అధికారులు 33 సర్వే నంబరా అని ఎదురు ప్రశ్న వేస్తూ కామన్‌ అన్నట్టు చూస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే భూ సమస్యకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు.

ఇష్టారాజ్యంగా పట్టాలు..

కొనరావుపేట గ్రామ శివారులో 33 సర్వే నంబర్‌లో వాస్తవంగా 2006 సంవత్సరం వరకు 196 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, ప్రస్తుతం 486 ఎకరాలకు పట్టా ఉంది. 290 ఎకరాలు అధికంగా నమోదు చేశారు. అక్రమ పట్టాదారులు రైతు భరోసా, పీఎం కిసాన్‌, బ్యాంకులో క్రాప్‌ లోన్లు తీసుకుని లబ్ధిపొందుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం

ఈ సమస్యకు మూల కారణం గతంలో పని చేసిన వీఆర్‌ఓలు. ఎకరానికి పది వేలు చొప్పున తీసుకుని ఇష్టారీతిన పట్టాలు జారీ చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. డబ్బులిస్తే చాలు.. గ్రామంతో సంబంధం లేని వ్యక్తుల పేరిట కూడా పట్టాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత అక్రమ పట్టాదారులు భూమి తనదేనంటూ సాగు చేసుకుంటున్న రైతులతో గొడవ పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఒక అధికారి ఏకంగా తన కుటుంబ సభ్యులకు కూడా పట్టా చేయించడం గమనార్హం.

రెవెన్యూ వ్యవస్థలో లోపాలు

33 సర్వే నంబర్‌లోని భూవివాదం రెవెన్యూ వ్యవస్థలోని పారదర్శకత, కచ్చితత్వం లోపాలను స్పష్టం చేస్తుంది. అధికారుల నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణలో తప్పిదాలు ఈ సమస్యకు దారితీశాయి. ఆన్‌లైన్‌ రెవెన్యూ రికార్డులు వాస్తవ భూవిస్తీర్ణంతో సరిపోలకపోవడం, అసైన్డ్‌ భూముల జారీలో అస్పష్టత వంటివి రైతుల గొడవలకు కారణమయ్యాయి. ఈ సమస్య రైతు భరోసా, పీఎం కిసాన్‌ వంటి పథకాల అమలును అడ్డుకుంటుంది. క్షేత్రస్థాయి సర్వే, కఠినమైన పర్యవేక్షణ ద్వారా ఇటువంటి సమస్యలను నివారించవచ్చు.

సర్వే చేసి

అర్హులకు అందజేస్తాం

కొనరావుపేట శివారులోని సర్వే నంబర్‌ 33లో భూమిని సర్వేయర్లతో టీం ఏర్పాటు చేసి కొలత చేయిస్తాం. మోఖాపై రైతులు ఎవరు, సాగు చేయకుండా పట్టాలు పొందిన వారు ఎవరు అనే విషయాలను పరిశీలిస్తాం. అనంతరం ఒరిజినల్‌ పట్టా దారులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం.

– లక్ష్మీరాజయ్య, తహసీల్దార్‌, కొత్తపల్లిగోరి

ఉన్నది 196 ఎకరాలు.. 486 ఎకరాలకు పట్టాలు!

కొనరావుపేటలో భూ వివాదం

అధికారుల మామూళ్లతో రైతులకు శిక్ష

ఏళ్లుగా భూముల కోసం గొడవలు

సర్వే నంబర్‌ 331
1/1

సర్వే నంబర్‌ 33

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement