
డయేరియా ప్రబలకుండా ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో డయేరియా బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్టాప్ డయేరియా–2025 క్యాంపెయిన్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 0–5 సంవత్సరాల చిన్నారులు డబేరియా బారిన పడే అవకాశం ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వలన డయేరియా ప్రబలే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, డీఈఓ రాజేందర్, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, బీసీ సంక్షేమ అధికారి క్రాంతికిరణ్, ఆర్డీఓ రవి, వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ శ్రీదేవి, ప్రమోద్ పాల్గొన్నారు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం..
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం మహిళా, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నాషా ముక్త్ భారత్ అభియాన్ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత డ్రగ్స్కు అలవాటు పడి వ్యసనాలకు బలి అవుతుందన్నారు.
రైతువేదికల్లో ఏర్పాట్లు చేయాలి..
మంగళవారం రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమానికి రైతు వేడుకల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వానాకాలం పంట సాగుకు రైతు భరోసా నిధులను విజయవంతంగా రైతుల ఖాతాలో జమ చేసిన సందర్భంగా నేడు(మంగళవారం) సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
విచారణ వేగవంతం చేయాలి
ప్రజాపాలన, మీ సేవా కేంద్రాల్లో వచ్చిన రేషన్ కార్డుల దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక సరఫరా, రేషన్ కార్డుల దరఖాస్తుల విచారణ, భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై రెవెన్యూ, పంచాయతీ రాజ్, గృహ నిర్మాణ శాఖ, ఇరిగేషన్, మైనింగ్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల దరఖాస్తుల విచారణ ప్రక్రియ ఐదు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను జిల్లాలోని వనరుల నుంచి ఉచితంగా ఇవ్వాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో 48,651 దరఖాస్తులు వచ్చాయని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఎస్ఓ శ్రీనాథ్, డీపీఓ వీరభద్రయ్య, మైనింగ్ ఏడీ జయరాజ్, గృహ నిర్మాణశాఖ పీడీ లోకిలాల్, ఆర్డీఓ రవి, తహసీల్దార్లు, ఎంపిడీఓలు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్శర్మ