పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలి
● జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని
గోవిందరావుపేట: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.పాణిని అన్నారు. మండల పరిధిలోని చల్వాయి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో క్లీనింగ్, హైజీన్ అండ్ సానిటేషన్ వన్ డే వర్క్షాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా విద్యా శాఖ అధికారి జి.పాణిని, జీసీడీఓ రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాణిని మాట్లాడుతూ పాఠశాలల్లో మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. పాఠశాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 9 మండలాల కేజీబీవీ, టీఎస్ఎంఎస్ గర్ల్స్ హాస్టల్స్, టీఎస్ఆర్ఈఐఎస్ బండారుపల్లికి చెందిన స్కావెంజర్స్, ఏఎన్ఎంఎస్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన సౌకర్యాలు●
● జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తుందని జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల పరిధిలో శనివారం నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరపత్రాలను డీఈఓ ఆవిష్కరించారు. పదో తరగతి ఫలితాల్లో 551 మార్కులు సాధించిన అజయ్ను డీఈఓ సన్మానించారు. గ్రామంలో ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి మాట్లాడారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా విద్య, ఆరోగ్యం, న్యూట్రిషన్లపై శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న నూతన సాంకేతిక విద్య, క్రీడా, సాంస్కృతిక, ఇతర అంశాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దేవానాయక్, సీఎంఓ రమేష్, కోఆర్డినేటర్లు లక్ష్మణ్, రాజగోపాల్, ప్రధానోపాధ్యాయులు అశోక్ పాల్గొన్నారు.
టూర్ ప్యాకేజీని వినియోగించుకోవాలి
ములుగు రూరల్: జిల్లాలోని రామప్ప, బొగత, మల్లూరు పర్యాటక ప్రాంతాలతో పాటు ప్రసిద్ధ శైవక్షేత్రాలైన పంచరామాలు వెళ్లేందుకు ఆర్టీసీ టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసిందని వరంగల్ –2 డిపో మేనేజర్ జ్యోత్స్న శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రామప్ప, బొగత, మల్లూరు వెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ.530, పంచరామాలు వెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ.2300 చార్జి తీసుకుంటున్నామని అన్నారు. పూర్తి వివరాల కోసం 99592 26048, 90634 52131, 93465 54351 నంబర్లలో సంప్రదించాలని చెప్పారు.
దరఖాస్తు చేసుకోండి
వాజేడు: ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ కోర్సులలో చేరడం కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని వాజేడు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ పి.శేఖర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 సంవత్సరానికి గాను 10వ తరగతి పాసైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్లైన్ చేసే సమయంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 21వరకు గడువు ఉందని ఆ లోగా తప్పనిసరిగా ఆన్లైన్ చేసుకోవాలని సూచించారు.
పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలి


