జనగామ: మున్సిపల్ కౌన్సిల్లో బడ్జెట్, అజెండా అంశాల తయారీపై తీవ్ర అసంతృప్తి నెలకొందని మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు ప్రేమలతారెడ్డి, పోకల జమున లింగయ్య విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.. 54 అజెండా అంశాలు తయారు చేసే సమయంలో వైస్ చైర్మన్ను ఎందుకు ఆహ్వానించలేదన్నారు. సాధారణ మున్సిపల్ బడ్జెట్ నుంచి రూ.1.50 కోట్ల మొత్తాన్ని మళ్లిస్తే కార్మికుల జీతాలు, పీఎఫ్లు, ఆఫీసు అత్యవసర ఖర్చులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అజెండా సిద్ధం చేసే ప్రక్రియను పూర్తిగా పక్కనబెట్టి, మూడు రోజుల ముందు ఇవ్వాల్సిన కాపీలు ఒక్కరోజు ముందే ఇచ్చారని నిలదీశారు. సమావేశం జరుగుతున్న సమయంలో కౌన్సిల్ హాల్లోకి పోలీసులను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. వైస్ చైర్మన్ను వేదికపై నుంచి దిగమని పోలీసులు అడగడమేంటి, ఇది స్పష్టమైన ప్రొటోకాల్ ఉల్లంఘన అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ అజెండా అంశాల గురించి తనకు తెలియదని చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు సేవెల్లి మధు, గోపగోని సుగుణాకర్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్రెడ్డి, సజ్జ దుర్గాప్రసాద్, గునిగంటి వెన్నెల, పానుగంటి సువార్త, మామిడాల రజిత, అనూష, నాయకులు మల్లేశం, ఉల్లెంగుల సందీప్, రాజు, దావెర రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు
ప్రేమలతారెడ్డి, జమున


