
డ్రా విధానాన్ని రద్దు చేయాలి
జనగామ రూరల్: ఉపకరణాల ఎంపికలో డ్రా పద్ధతిని రద్దు చేసి అర్హత ఉన్న ప్రతీ దివ్యాంగుడికి అందించాలని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాముకుంట్ల చందు, బిట్ల గణేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, జిల్లా సంక్షేమాధికారి ఫ్లోరెన్స్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులకు ఉచితంగా అందించే పరికరాల్లో ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్ కాదని జిల్లా అధికారులు డ్రా పద్ధతిలో ఎంపిక చేసిన లిస్టును వెంటనే రద్దు చేయాలన్నారు. జిల్లాలో ఆన్లైన్ బెనిఫిషియర్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్ ద్వారా అర్హత కలిగిన దివ్యాంగులు 88 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వెంటనే డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసిన లిస్టును రద్దు చేసి ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్ ప్రకారం మళ్లీ అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డి.వీరస్వామి, ఉద్దవ్, సాయి పాల్గొన్నారు.
సీనియర్ సిటిజన్ కార్డులు మంజూరు చేయాలి
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు గుర్తింపు కార్డులను అందించాలని జిల్లా వయోవృద్ధుల సంఘం అధ్యక్షుడు తీగల సిద్దిమల్లయ్య అన్నారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల కార్డులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలని విన్నవించారు. కార్డుల ద్వారా పథకాలు నిరాటంకంగా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సమస్యల పరిష్కారానికి పోరాటం
జనగామ రూరల్: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి యూఎస్పీసీఎస్ ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటాలు చేయనున్నట్లు ఉపాధ్యాయ సంఘ నాయకులు చంద్రశేఖర్రావు, డి.శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశల వారీగా ఉద్యమించనున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి నేడు, రేపు మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు, ఆగస్టు 1న జిల్లా కేంద్రం కలెక్టరేట్ ఎదుట ధర్నా, 23న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ ఉపాధ్యాయ సంఘం నాయకులు నాగుల రాజు, ఇప్ప రాంరెడ్డి, సత్తయ్య, మడూరి వెంకటేష్, శ్రీనివాస రావు, శాడ రవి, చొక్కయ్య శ్రీనివాసులు, అఫ్సర్, రాజిరెడ్డి పాల్గొన్నారు.
నవ సమాజ వైతాళికుడు దాశరథి
జనగామ రూరల్: సమాజ మార్పుకోసం తన స్వరాన్ని వినిపించిన గొప్ప కవి దాశరథి కృష్ణమాచార్యులు అని సాధిక్ ఫౌండేషన్ చైర్మన్ సాధిక్ అలీ అన్నారు. మంగళవారం స్థానిక ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాధిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహా కవి దాశరథి కృష్ణమాచార్య జయంతిని నిర్వహించారు. అనంతరం కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ భవాని అధ్యక్షతన నిర్వహిహించిన సమావేశంలో సాధిక్ అలీ మాట్లాడుతూ నిజాం పాలకులపై తన దిక్కార స్వరాన్ని వినిపించి జైలు కెళ్లిన ధీశాలి అని అభివర్ణించారు. దాశరథి సాహిత్యాన్ని విద్యార్థులకు వారి పద్యాలు, పాటల ద్వారా వివరించారు. విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ముమ్మర తనిఖీలు
జనగామ రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ, కేజీబీవీల్లో మంగళవారం అధికారులు ముమ్మర తనిఖీలు చేశారు. ప్రతీ మంగళవారం జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు వారి పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని చౌడారంలోని కేజీబీవీని తహసీల్దార్ హుస్సేన్ సందర్శించారు. వంట గదిలో కూరగాయల పరిశుభ్రతను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు.

డ్రా విధానాన్ని రద్దు చేయాలి