
జల సంరక్షణకు అధిక ప్రాధాన్యం
జనగామ రూరల్: జల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.. వివిధ శాఖల ద్వారా భూగర్భ జలాల సంరక్షణకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. ‘జలశక్తి అభియాన్’ కింద నేషన ల్ వాటర్ అవార్డ్స్–2024 కోసం కేంద్రం నుంచి అధ్యయన కమిటీ సభ్యులు కేంద్ర భూగర్భ జల శాఖ సైంటిస్ట్ డాక్టర్ ఎమ్.సుధీర్కుమార్, భూగర్భ జల కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ చరణ్ బుధవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా వారికి కలెక్టర్ జిల్లాలో భూగర్భజల వనరుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అశ్వరావుపల్లి, చీటకో డూరు, స్టేషన్ఘనపూర్ రిజర్వాయర్ల సామర్థ్యం, సాగు, తాగు నీటి వినియోగం గురించి తెలియజేశా రు. ఉద్యానవన పంటల సాగుకు నీటి సంరక్షణలో భాగంగా స్ప్రింక్లర్లు, డ్రిప్ పరికరాల వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదిలా ఉండగా.. చేపల పెంపకం వలన సుమారు 80వేల మంది మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారని, చేపలను ఎగుమతి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, నీటిపారుదల ఎస్ఈ సుధీర్, వ్యవసాయం, ఫిషరీస్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాటికొండలో జలశక్తి బృందం
స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామంలోని వాటర్షెడ్ పథకం కింద చేపట్టిన పనులను కలెక్టర్ రిజ్వాన్బాషా, అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి కేంద్ర జలశక్తి బృందం బాధ్యులు బుధవారం పరిశీలించారు. ముందుగా తాటికొండ రైతువేదికలో మహిళా సంఘం సభ్యులతో సమావేశమై తాగునీటి సరఫరా గురించి తెలు సుకున్నారు. గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామ ని, ప్రస్తుతం వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టి ఇంటింటికీ నీరు ఇస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం గురించి అడగ్గా.. గతంలో దిగుబడి అంతంత మాత్రమే ఉండేదని, ప్రస్తుతం భూగర్భ జలాలు పెరిగి పంటల సాగు లాభసాటిగా ఉందన్నారు. ఘన్పూర్ రిజర్వాయర్ నిర్మాణంతో భూగర్భ జలా లు పెరిగి ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని కలెక్టర్ కేంద్ర బృందానికి వివరించా రు. తాటికొండ అటవీ ప్రాంతంలో గుట్టల పైనుంచి పడుతున్న వర్షపునీరు భూమిలోకి ఇంకడానికి కందకాలను అంచలంచెలుగా నిర్మించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, డీఏఓ రామారావునాయక్, మత్స్యశాఖ అధికారి రాణాప్రతాప్, అదనపు డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్, పంచా యతీ సెక్రటరీ సత్యనారాయణ పాల్గొన్నారు.
పర్యావరణంపై అవగాహన అవసరం
జనగామ రూరల్: విద్యార్థులకు పర్యావరణపై అవగాహన అవసరమని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నా రు. నేషనల్ గ్రీన్ కోర్ తయారుచేసిన నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీ పోస్టర్ను బుధవారం కలెక్టరేట్లో ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘హరిత్ ద వే ఆఫ్ లైఫ్’ అనే థీమ్పై దేశవ్యాప్తంగా 1వ తరగతి నుంచి పరిశోధన విద్యార్థుల వరకు ఐదు విభాగాల్లో నిర్వహించే ఈ పోటీకి జూలై 1 నుంచి ఆగస్టు 21 వరకు రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుందని, ఎకో మిత్రమ్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. హిందీ, ఇంగ్లిష్ మరిన్ని భాషల్లో క్విజ్ ఉంటుందని, విద్యార్థులతోపాటు సామాన్య పౌరులు కూడా పాల్గొనవచ్చని వివరించారు. పోటీలో పాల్గొన్న ప్రతీ విద్యార్థికి వెంటనే ఇ–సర్టిఫికెట్ లభిస్తుందని విద్యా సంస్థలకూ ప్రత్యేక గుర్తింపు ఇస్తారని తెలిపారు. మొక్క నాటుతున్న, నీరు సేవ్ చేస్తున్న లేదా వ్యర్థాలను వేరు చేస్తున్న సెల్ఫీ అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్జీసీ కోఆర్డినేటర్ గౌసియా బేగం, ఏఎంఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో అగ్రగామిగా నిలపాలి
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ(ఎస్ఎస్జీ)–2025లో జిల్లాను అగ్రగామిగా నిలపాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. కలెక్టరేట్లో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఎం, ఏపీఓ, పంచాయితీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికుల పనితీరు బాగుండాలని చెప్పారు. గ్రామానికి 20 చొప్పున ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు. డీపీఓ స్వరూప, డీఎల్పీఓ వెంకట్రెడ్డి, కర్ణాకర్ పాల్గొన్నారు.