
డయేరియాపై అవగాహన కల్పించాలి
జనగామ రూరల్: డయేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో డయేరియా క్యాంపెయిన్– 2025ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 31వ తేదీ వరకు చేపడుతున్న డయేరియా ప్రచారం విస్తృతంగా చేపట్టాలని, ప్రతిఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలు, సబ్ సెంటర్లు, పీహెచ్సీల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాలో ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు ఓఆర్ఎస్ తాగించాలని, జింక్ టాబ్లెట్లు వాడాలన్నారు.
ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక యాత్ర..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి విహారయాత్ర ప్యాకేజీని రూపొందించిన ప్రత్యేక యాత్ర పోస్టర్ను కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ స్వాతితో కలిసి మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ ప్రత్యేక యాత్ర ప్రదేశాలు చూడాలనుకునే వారికి ఐదు రూట్లో ప్రయాణించేందుకు ప్రత్యేక విహార యాత్ర టూర్ ప్యాకేజీ అవకాశం కల్పించిందన్నారు. రూట్ –1లో రంగాపురం, బీచుపల్లి, జోగులాంబ యాత్రకు పెద్దలకు రూ.1100, పిల్లలకు రూ.600, రూట్–2లో పర్ణశాల, భద్రాచలం, కిన్నెరసాని డ్యాం, మల్లూరు, బొగత, మేడారం, రామప్ప, లక్నవరం ఉందని, పెద్దలకు రూ.1300, పిల్లలకు రూ. 700 చార్జీ కేటాయించినట్లు తెలిపారు. ఇలా రూట్ –3, 4, 5లో కూడా వివిధ ప్రదేశాలు ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 7382852923, 7382852818, 9948164847, 7981951562 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎండీ హుస్సేన్, ఎస్ఎం ఎం. సమ్మయ్య, సూపరింటెండెంట్ వై.యాదమణిరావు, ఎం ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ క్రీడా సంబురాల
పోస్టర్ ఆవిష్కరణ
సోషల్ వాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో తెలంగాణ క్రీడా సంబురాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ క్రీడలో గెలుపొందిన వారు మొదటి బహుమతిగా రూ.లక్ష పొందవచ్చన్నారు. యువత చెడు మార్గాన్ని వీడి, సన్మార్గంలో పయనించాలన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా