కథలాపూర్: అన్నదాతలు విత్తనాల కొనుగోలు నుంచి పంట అమ్ముకునే వరకు ఏదో ఒక రూపంలో నష్టపోతున్నారు. ఈ క్రమంలో నకిలీ విత్తనాలు విక్రయించినా.. తయారుచేసినా పీడీ యాక్డ్ అమలు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించడంతోపాటు ప్రత్యేకంగా పోలీసులు, వ్యవసాయ అధికారులతో విజిలెన్స్ టీంలను ఏర్పాటు చేసింది. షాపుల్లో తనిఖీలనూ ముమ్మరం చేసింది.
తనిఖీలు ముమ్మరం
జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి. కథలాపూర్ మండలంలో 19 గ్రామాలున్నాయి. వానాకాలం సీజన్లో రైతులు సుమారు 30వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. విత్తనాలు, ఎరువులు విక్రయించేందుకు 32 షాపులకు అనుమతి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఓ గ్రామంలో విత్తనాలు విక్రయిస్తుండగా.. అధికారులు తనిఖీ చేసి వాటి శాంపిళ్లను ఉన్నతాధికారులకు పంపించారు. మరో గ్రా మంలో విత్తనాల దుకాణం లైసెన్స్ను రెన్యూవల్ చేసుకోలేదని గుర్తించి నోటీసులు ఇచ్చారు. విత్తనాల దుకాణాల్లో సోదాలు చేస్తూ.. ఏయే విత్తనాలు విక్రయిస్తున్నారో పరిశీలిస్తున్నారు. వాటిని ఎక్కడ కొనుగోలు చేశారు..? ఆ విత్తనాల మొలకశాతం ఎంత..? అనే విషయాలను తెలుసుకుంటున్నారు. విత్తనాలను ఎవరికి విక్రయిస్తున్నారో రైతు పేరు, సెల్ఫోన్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలని దుకాణాల యజమానులకు సూచిస్తున్నారు.
మంచి విత్తనాలు కొనుగోలుపై
రైతులకు అవగాహన
వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు విత్తనాలు కొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. కొనుగోలు చేసే విత్తనాలు ఒకటికి రెండు సార్లు సరి చూసుకొని కొనుగోలు చేయాలని చెబుతున్నారు. లూజు, కంపెనీ లేబుల్ లేని విత్తనాలను కొనుగోలు చేయవద్దని, విత్తనాలు కొనే సమయంలో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని సూచిస్తున్నారు. రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టి మోసం చేస్తే చట్టపరంగా చర్యలను తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ముమ్మర తనిఖీ చేస్తున్న అధికారులు
విత్తనాల కొనుగోలుపై రైతులకు అవగాహన


