భూమి ఎంతున్నా.. రుణం అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

భూమి ఎంతున్నా.. రుణం అంతంతే..

May 26 2025 12:14 AM | Updated on May 26 2025 9:54 AM

భూమి

భూమి ఎంతున్నా.. రుణం అంతంతే..

● స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఉత్తర్వులు పట్టని బ్యాంకర్లు ● రైతులకు ఇచ్చేది రూ.లక్ష నుంచి రెండు లక్షలలోపే

పంట రుణం(రూ.లలో)

వరి 44,000 – 46,000

మొక్కజొన్న 34000 – 36,000

వేరుశనగ 32,000 – 34,000

మిర్చి 84,000 – 86,000

పత్తి 46,000 – 48,000

పసుపు 88,000 – 90,000

చెరుకు 80,000 – 82,000

నువ్వు 20,000 – 22,000

కందులు 23,000– 25,000

మల్బరీ 60,000 – 62,000

టమాట 55,000 – 57,000

మామిడి 64,000 – 66,000

పెసర 20,000 – 22,000

కూరగాయలు 35,000 – 37,000

జగిత్యాలఅగ్రికల్చర్‌: పంటల సాగుకు పెట్టుబడి కోసం రైతులు బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటుంటారు. ఆ రుణాన్ని ఏడాదిలోపు వడ్డీతో సహా చెల్లించి కొత్తగా రుణం తీసుకుంటారు. బ్యాంకర్లు మాత్రం రైతులకు భూమి ఎంత ఉన్నా.. కొన్ని బ్యాంకులు రూ.లక్ష వరకు.. మరికొన్ని బ్యాంకులు రూ.2లక్షల వరకే ఇచ్చేందుకు పరిమితం అవుతున్నాయి. బ్యాంకులు ఇచ్చిన రుణం సరిపోక రైతులు వడ్డీ వ్యాపారులు, పైనాన్స్‌ సంస్థలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.

రుణం పెంచమంటే ససేమిరా

జిల్లాలో 90 శాతం మంది రైతులు తమ సమీప గ్రామాల దత్తత బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారు. ఏటా సక్రమంగా తిరిగి కడుతూ.. బ్యాంకు అధికారుల వద్ద నమ్మకం పెంచుకుంటున్నారు. మరోవైపు ఏటేటా పంట సాగు ఖర్చులు రెంటింపవుతున్నాయి. కాని పంట రుణం పెంచాలని అడిగితే బ్యాంకర్లు మాత్రం ససేమిరా అంటున్నారు. బ్యాంకర్లు రైతులకు సరిపడా రుణం ఇవ్వడం లేదు. భూమి ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల వరకు మాత్రమే తీసుకుని పంటలు సాగు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పసుపు, పండ్లతోటలు వంటి వాణిజ్య పంటలు సాగు చేసే రైతులు ఎక్కువ మొత్తంలో రుణం ఇవ్వాలని కోరితే నిబంధనలు ఒప్పుకోవని బ్యాంకర్లు లేనిపోని సాకులు చెపుతున్నారు. ఎక్కువ రుణం కావాలంటే భూమిని మార్టిగేజ్‌ చేసుకోవాలని చెబుతుండడంతో చాలామంది ఇచ్చినదాంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇక పిల్లల చదువులు, ఆస్పత్రుల ఖర్చుల కోసం అప్పు తీసుకునే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ఏటా ఆయా పంటలకు ఇవ్వాల్సిన రుణాన్ని ప్రభుత్వం సీజన్‌కు ముందుగానే బ్యాంకర్లకు ఆదేశాలు ఇస్తుంది. ఆ మేరకు ఏ బ్యాంకు కూడా రుణాలు ఇవ్వడం లేదు. నిబంధనల సాకుతో రుణం పెంచేందుకు వెనుకంజ వేస్తున్నాయి. పెరుగుతున్న పెట్టుబడుల నేపథ్యంలో బ్యాంకులు ఇచ్చే రుణం సరిపోక అధిక వడ్డీకి ఫైనాన్స్‌ సంస్థల వద్ద అప్పు తెచ్చుకుంటున్నారు. ఆ అప్పు చెల్లించేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. రైతులు గ్రామాల్లో గ్రూపులుగా ఏర్పడి చీటీలు వేసుకుంటూ డబ్బులు సమకూర్చుకుంటున్నారు. ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో రైతులు చీటీలు వేసుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ప్రస్తుత ఏడాది ప్రభుత్వం, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కలిసి జిల్లాలో సాగు చేసే ప్రధాన పంటలకు బ్యాంకులు ఇవ్వాల్సిన రుణ పరిమితిని ప్రకటించాయి.

రెండు లక్షలకు మించి ఇవ్వడం లేదు

నాకు ఐదెకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది. రూ.లక్ష లేదంటే రూ.రెండు లక్షలు మాత్రమే రుణం ఇస్తున్నారు. నాలాగా చాలామంది రైతులు ఏటా తీసుకున్న రుణాన్ని చెల్లిస్తూనే ఉన్నారు. సక్రమంగా రుణం చెల్లిస్తున్న రైతులకు అధిక మొత్తంలో రుణం ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది.

– కోల నారాయణ, చల్‌గల్‌

స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ మేరకే

వానాకాలం సీజన్‌కు అన్ని బ్యాంకుల్లో పంట రుణాల పంపిణీ ప్రారంభమైంది. కొ ందరు పాత రుణాలు చెల్లించి, కొత్త రుణం తీసుకుంటున్నారు. సక్రమంగా రుణం చెల్లించే వారికి స్కేల్‌ ఆఫ్‌ పైనాన్స్‌ మేరకు ఎక్కువ మొత్తంలో పంట రుణం ఇస్తున్నాం.

– రాంకుమార్‌,

లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌, జగిత్యాల

భూమి ఎంతున్నా.. రుణం అంతంతే..1
1/2

భూమి ఎంతున్నా.. రుణం అంతంతే..

భూమి ఎంతున్నా.. రుణం అంతంతే..2
2/2

భూమి ఎంతున్నా.. రుణం అంతంతే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement