నీరు వృథా.. తప్పని వ్యథ | - | Sakshi
Sakshi News home page

నీరు వృథా.. తప్పని వ్యథ

May 26 2025 12:14 AM | Updated on May 26 2025 9:54 AM

నీరు

నీరు వృథా.. తప్పని వ్యథ

● ప్రధాన చోట్ల లీకేజీ అవుతున్న తాగునీరు ● ఇబ్బంది పడుతున్న ప్రజలు ● మరమ్మతుల్లో జాప్యం

జగిత్యాల: అసలే జిల్లా కేంద్రం.. ఆపై గ్రేడ్‌–1 మున్సిపాలిటీ. ఇక్కడ లక్షకు పైగా జనాభా ఉండగా వారికి సరిపడా ప్రతిరోజు 18.1 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ ఫర్‌ డే) అవసరం. ప్రస్తుతం 1.80 కోట్ల లీటర్ల నీటిని మున్సిపల్‌ అధికారులు సరఫరా చేస్తున్నారు. అయితే లీకేజీలతో శివారు కాలనీలు, ప్రధాన ప్రాంతాలకు నీరు చేరడం లేదు. దీంతో నీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే అమృత్‌ 2.0 కింద పైప్‌లైన్‌ మరమ్మతు, నూతన పైప్‌లైన్ల నిర్మాణం చేపడుతున్నారు. కానీ లీకేజీలను అరికట్టడంలో మాత్రం మున్సిపల్‌ అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రానికి ధర్మసముద్రం వద్దనున్న ఫిల్టర్‌ బెడ్‌ల నుంచి నాలుగు ప్రధాన వాటర్‌ ట్యాంక్‌లకు నీరు సరఫరా అవుతోంది. వాటర్‌ ట్యాంక్‌లకు ఫిల్టర్‌బెడ్‌ల నుంచి వచ్చే ప్రధాన పైప్‌లైన్లు చాలా చోట్ల లీకేజీలు ఉన్నాయి. ట్యాంక్‌లకు వచ్చే వరకే నీరు వృథా అవుతోంది. ట్యాంక్‌ల నుంచి వివిధ కాలనీలకు నీటిని సరఫరా చేస్తుంటారు. ఆ పైప్‌లైన్లకు కూడా అత్యధికంగా లీకేజీలు ఉండటంతో నీరు రోడ్లపై ప్రవహిస్తోంది.

మరమ్మతు చేస్తేనే

నీరు వృథాగా పోవద్దంటే మరమ్మతు ఒక్కటే శరణ్యం. ఇటీవలే కొన్ని చోట్ల మరమ్మతులు చేపడుతున్నప్పటికీ కొన్నిచోట్ల మున్సిపల్‌ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా పాతబస్టాండ్‌, తహసీల్‌ చౌరస్తా, కొత్తబస్టాండ్‌, నటరాజ్‌ చౌరస్తా, నిజామాబాద్‌ రోడ్‌, కరీంనగర్‌రోడ్‌లో ప్రధానమైన పైప్‌లైన్లు ఉంటాయి. ఇక్కడ లీకేజీలు కావడం ఇబ్బందికరంగా మారింది.

ఏటా రూ.10 లక్షలు కేటాయింపు

పైప్‌లైన్‌ల మరమ్మతు కోసం మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌ నుంచి ఏటా రూ.10 లక్షల నిధులు కేటాయిస్తుంటారు. ఎక్కడ లీకేజీ అయినా వెంటనే మరమ్మతు చేయించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేబర్‌ నిధులు సైతం అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలో అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రంగుమారుతున్న నీరు

లీకేజీ కారణంగా నీరు కలుషితం అవుతోందని, ఆ నీటిని వినియోగించుకోలేకపోతున్నామని ప్రజలు అంటున్నారు. కొన్నిచోట్ల ముదురు రంగులో సరఫరా అవుతోందని చెబుతున్నారు. ఆ నీటిని తాగితే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది జిల్లాకేంద్రంలోని తహసీల్‌ చౌరస్తా. ఇక్కడ తరచూ తాగునీటికి సంబంధించిన గేట్‌వాల్‌ లీకేజీ అవుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు నీరు వృథా అవుతూనే ఉంది. మరమ్మతు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టణానికి నీరు సరఫరా చేసే ప్రధాన గేట్‌ వాల్‌ కావడం.. ఏళ్ల క్రితం దీనిని వేయడంతో లీకేజీ ఆగడం లేదు. అధికారులు స్పందించి కొత్త పైప్‌లైన్‌ వేసి గేట్‌వాల్‌ బిగించాలని ప్రజలు కోరుతున్నారు.

నీరు వృథా.. తప్పని వ్యథ1
1/1

నీరు వృథా.. తప్పని వ్యథ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement