
మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి
జగిత్యాలటౌన్: మల్టీపర్పస్ విధానం రద్దు చేసి పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో పారిశుధ్యం, మంచినీటి సరఫరా, విద్యుత్, ట్రాక్టర్, డంపింగ్ యార్డు నిర్వహణలో సేవలందిస్తున్నారని, డెంగీ, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నారని వివరించారు. అలాంటి వారిని ప్రభుత్వం మల్టీపర్పస్ విధానం పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోమటి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పులి మల్లేశం, మహిళా నాయకురాలు న్యాతరి మల్ల్లవ్వ, వివిధ మండలాల పంచాయతీ కార్మికులు సిబ్బంది పాల్గొన్నారు.