
కొనుగోళ్ల జాప్యంపై పురుగు మందు డబ్బాతో రైతు నిరసన
సారంగాపూర్: సారంగాపూర్ మండలం లచ్చక్కపేటలోగల ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ.. ఓ రైతు క్రిమిసంహారక మందు డబ్బాతో నిరసన తెలిపాడు. కేంద్రంలో ధాన్యం పోసి 15 రోజులు గడస్తున్నా కొనుగోలు చేయడం లేదని నిరసనకు దిగగా కేంద్ర నిర్వాహకులు తనను అసభ్యంగా దూషించారని రైతు మల్లయ్య ఆరోపించాడు. వర్షానికి ధాన్యం మొలకెత్తిందని, అయినా ధాన్యం కొంటలేరని, నిర్వాహకులు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడు. ఒక దశలో పురుగుల మందు తాగడానికి ప్రయత్నించాడు. అక్కడున్న రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై దత్తాద్రి అక్కడికి చేరుకుని మల్లయ్య, కేంద్రం నిర్వాహకుడు సత్యనారాయణతో మాట్లాడారు. మల్లయ్య ధాన్యం కొనుగోలు చేయించడంతో సమస్య సద్దుమనిగింది.