
వ్యవసాయ కళాశాల తరలించొద్దు
జగిత్యాల: కోరుట్లలోని మహిళా అగ్రికల్చర్ కళాశాల తరలింపును ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి తిరుపతి అన్నారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో మహిళా అగ్రికల్చర్ కళాశాలను జిల్లాలో ఏర్పాటు చేసిందని, వెల్గటూర్ మండలం స్తంభంపల్లి వద్ద శాశ్వత భవన నిర్మాణానికి 70 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని గుర్తు చేశారు. కోరుట్లలో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లా బెజ్జంకికి తరలించేందుకు కుట్ర చేస్తోందన్నారు. ఏఐఎస్ఎస్ కన్వీనర్ మాణిక్ మాట్లాడుతూ ఈ ప్రాంతానికి అదనంగా యూనివర్సిటీ, విద్యాసంస్థలు, పరిశ్రమలు తీసుకురావాల్సిందిపోయి ఉన్న వాటిని తరలించడం సిగ్గుచేటన్నారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వంశీ మాట్లాడుతూ అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ దూరదృష్టితో ఈ జిల్లాలో అగ్రికల్చర్ కళాశాలను ఏర్పాటు చేస్తే దానిని తరలించడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కార్యదర్శి వినోద్కుమార్, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాకేశ్, మైనార్టీ విద్యార్థి అధ్యక్షుడు సోహెల్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, వెంకటేశ్, రాజు, నరేశ్ పాల్గొన్నారు.