వేంకటేశ్వరస్వామి ఉత్తర, దక్షిణ దిగ్యాత్రలు
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవేంకటేశ్వరస్వామి మంగళవారం దక్షిణ, ఉత్తర దిగ్యాత్రలను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం ధర్మపురి పోలీస్స్టేషన్లో పోలీసుల నుంచి విశేష పూజలు అందుకున్నారు. సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్కుమార్ స్వామివారికి పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారిని ఆలయం నుంచి పోలీస్స్టేషన్ వరకు అశ్వవాహనంపై శోభాయాత్రగా తీసుకెళ్లారు. ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులున్నారు.
ధర్మపురి: ధర్మపురి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు శాశ్వత మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని స్వయంగా కలెక్టర్ ఆదేశించినా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఇది బాధాకరమైన విషయమని ఆలయ మాజీ చైర్మన్ ఇందారపు రామయ్య అన్నారు. ఆలయంలో ఈనెల 10 నుంచి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. అయితే ఏర్పాట్లపై ఫిబ్రవరి 13న కలెక్టర్ అధ్యక్షతన వివిధశాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. సకల సౌకర్యాలు కల్పించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఇందులో ముఖ్యంగా తాగునీటి సమస్య. ఆ సమస్య తలెత్తకుండా చూడాలని రామయ్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బ్రహ్మగుండం నుంచి గడ్డ హన్మండ్లు ఆలయం వరకు పూర్వమున్న పాత పైప్లైన్ చెడిపోయిందని, మరమ్మతు చేస్తే సమస్య కొంత వరకు తగ్గుతుందని ఆయన కలెక్టర్కు విన్నవించారు. దీనికి కలెక్టర్ స్పందించి అవసరమైన ప్రతిపాదనలు పంపిస్తే రూ.5లక్షలు మంజూరు చేస్తానని హామీ కూడా ఇచ్చారు. అయితే కలెక్టర్ సూచించిన విధంగా అధికారులు పాత పైపులైన్ను పరిశీలించి వెళ్లారు తప్ప అందుకు అవసరమైన నివేదికను తయారుచేయలేదు. దీంతో భక్తులు తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలకు నిత్యం వస్తున్న వేలాదిమంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు గోదావరిలో ఉన్న బావి మోటార్ ఐదు రోజుల క్రితం కాలిపోవడంతో నీటి సమస్య తీవ్రమైంది. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి ఆలయం ముందున్న సంపును నింపే ప్రయత్నం చేస్తున్నారని రామయ్య తెలిపారు. ఒకవేళ కలెక్టర్ సూచించినట్లు పైపులైన్కు ఏస్టిమేట్ తయారు చేస్తే నిధులు వచ్చేవని, తద్వారా సమస్య తలెత్తేది కాదని భక్తులు అంటున్నారు.
● నీటి సమస్యతో భక్తుల ఇబ్బందులు
కలెక్టర్ ఆదేశించినా కదలని అధికారులు
కలెక్టర్ ఆదేశించినా కదలని అధికారులు