● ఎమ్మెల్యే సంజయ్ కుమార్
రాయికల్: గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య, వైద్యం సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మండలంలోని ఉప్పుమడుగు గ్రామంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో రూ.3.25 కోట్లతో చేపట్టనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. పట్టణంలో లైబ్రరీ మంజూరు చేశామని, త్వరలోనే పనులు చేపడతామని తెలిపారు. అనంతరం అల్లీపూర్లో రూ.ఆరు లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. డీఈఓ రాము, సింగిల్ విండో చైర్మన్ దీటి రాజిరెడ్డి, తహసీల్ధార్ ఖయ్యుం, ఎంపీవో సుష్మ, ప్రిన్సిపాల్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధిని వినియోగించుకోవాలి
జగిత్యాల: సీఎం సహాయనిధిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 102 మంది లబ్ధిదారులకు రూ.28.25 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. మున్సిపల్ మాజీ చైర్మన్లు జ్యోతి, నాగభూషణం, శ్రీనివాస్, దామోదర్రావు పాల్గొన్నారు.
పట్టణాభివృద్ధికి సహకరించండి
జగిత్యాల పట్టణాభివృద్ధికి అందరి సహకారం అవసరమని ఎమ్మెల్యే అన్నారు. గోవిందుపల్లిలో ఈజీఎస్ నిధులు రూ.35 లక్షలతో చేపడుతున్న సీసీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. గోవిందుపల్లి వాగుపై రూ.4.5 కోట్లతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. మోతె చెరువుకు రూ.2 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.