White House Condemns Harassment Of Sabrina Siddiqui On PM Question - Sakshi
Sakshi News home page

‘మోదీకి మైనారిటీల హక్కుల ప్రశ్న.. జర్నలిస్ట్‌ సబ్రీనాపై వేధింపులు సరికాదు’

Jun 27 2023 2:00 PM | Updated on Jun 27 2023 3:27 PM

White House Condemns Harassment Of Sabrina Siddiqui On PM Question - Sakshi

భారత్‌లో మైనారిటీలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై మోదీకి ఎదురైన..

వాష్టింగ్టన్‌: అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీకి.. భారత్‌లో మైనారిటీల హక్కుల సంరక్షణపై ప్రశ్న గుప్పించిన మహిళా జర్నలిస్ట్‌ వేధింపులు ఎదుర్కొందట. ఈ విషయం తమకూ తెలుసున్న అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌.. ఆ వేధింపులను ఖండిస్తున్నట్లు ప్రకటించింది. 

అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీ-అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో.. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ జర్నలిస్ట్‌ అయిన సబ్రీనా ‘భారత్ లో ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల పక్షపాతంపై మీరేమంటారు.. ఇండియాలో మైనారిటీల హక్కులను కాపాడేందుకు మీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. దీనికి జవాబిస్తూ.. ఈ ప్రశ్న తనను సర్ ప్రైజ్ చేసిందని అన్నారు. మనమంతా ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని, ప్రజాస్వామ్యమే మన ఆత్మ అని, పక్షపాతానికి ప్రజాస్వామ్యంలో చోటులేదని చెప్పుకొచ్చారు.

అప్పటి నుంచి ఆమె ఆన్ లైన్ లో వేధింపులు ఎదుర్కొంటోందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆరోపించగా.. వైట్ హౌస్ ఉన్నతాధికారి జాన్ కిర్బీ స్పందించారు. సబ్రీనా సిద్దిఖీ సైబర్ వేధింపులకు గురవుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిర్బీ తెలిపారు. జర్నలిస్టులపై ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి రకమైన దాడి అయినా ఖండించాల్సిందేనన్నది అమెరికా ఉద్దేశమని పేర్కొన్నారు. ఇలా వేధింపులకు గురిచేయడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి పనికిరాదని వ్యాఖ్యానించారు.

కిర్బీ ప్రకటన తర్వాత.. వైట్‌హౌజ్‌ ప్రెస్‌ సెక్రటరీ కరైన్‌ జీన్‌ పెర్రీ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. కిర్బీ ప్రకటనతో తానూ ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.

సబ్రీనా సిద్ధిఖీ పాక్‌ మూలాలున్న వ్యక్తి. ఆమె తల్లిదండ్రులు పాకిస్థాన్‌కు చెందిన వాళ్లే అయినా.. తండ్రి మాత్రం భారత్‌లో జన్మించారు. సబ్రీనా మాత్రం అమెరికాలో జన్మించారు. నార్త్‌వెస్ట్రన్‌ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన ఆమె.. భర్తతో కలిసి వాషింగ్టన్‌లో ఉంటున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె రిపోర్టింగ్‌ పనితీరు గురించి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2019 వరకు గార్డియన్‌ కోసం పని చేసిన ఆమె.. ఆ తర్వాత వాల్‌ స్ట్రీట్‌జర్నల్‌కు పని చేస్తూ వస్తున్నారు.  గతంలో హఫ్పింగ్‌టన్‌పోస్ట్‌, బ్లూమ్‌బర్గ్‌లోనూ ఆమె పని చేశారు. నాలుగేళ్ల కిందట ముహమ్మద్‌ అలీ సయ్యద్‌ జాఫ్రీ అనే వ్యక్తిని ఆమె పెళ్లాడారు. వీళ్లకు సోఫీ అనే పాప ఉంది. 

ఇదీ చదవండి: దేశంలో ఏం జరుగుతుందో తెలియాలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement