
తాలిబన్ వ్యతిరేకులు పంజ్షీర్ ప్రావిన్స్ నుంచి పోరాటం చేస్తున్న నేపథ్యంలో తాలిబన్లు పంజ్షీర్ లోయలో ఇంటర్నెట్ను నిలిపివేశారు. మాజీ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ తన సందేశాలను ట్విట్టర్ ద్వారా పంచుకోకుండా ఉండటానికి ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా తాలిబన్లు ఆక్రమించని ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఆఫ్ఘనిస్తాన్లోని పంజ్షీర్ ప్రావిన్స్ ప్రాంతం అని చెప్పుకోవాలి. పంజ్షీర్ ప్రావిన్స్లో తాలిబన్ వ్యతిరేకులు అందరూ అక్కడ ఉన్నారు. లెజెండరీ ఆఫ్ఘన్ తిరుగుబాటు కమాండర్ అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్ ప్రస్తుతం మాజీ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ తో కలిసి పంజ్షీర్ లోయలో ఉన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆగస్టు 15న దేశం నుంచిపారిపోయిన తర్వాత అమ్రుల్లా సలేహ్ దేశ రాజ్యాంగం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ చట్టబద్ధమైన కేర్ టేకర్ అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకున్నాడు. ఇప్పటికే తాలిబన్లు పంజ్షీర్ ప్రావిన్స్ను చుట్టుముట్టారు. ఏ క్షణమైనా వారు ఆ ప్రాంతంపై విరుచుకుపడే అవకాశం ఉంది. అయితే, పంజ్షీర్ దళం అధిపతి మసూద్ అంతర్జాతీయ దేశాల మద్దతు కావాలని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే, సలేహ్ వాదనను ఐక్యరాజ్యసమితి వంటి ఏ దేశం లేదా అంతర్జాతీయ సంస్థ ఇంకా గుర్తించలేదు.(చదవండి: మహిళలపై తాలిబన్ల అరాచకం.. మరో హుకుం జారీ)