ఇస్లామాబాద్లో జరిగిన సుదీర్ఘ శాంతి చర్చల అనంతరం అమెరికా ప్రతినిధి బృందం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తరువాత అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో జరిపిన టెలిఫోన్ సంభాషణలోని విషయాలను.. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు.
''నేను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో మాట్లాడాను. ఆయన ఇస్లామాబాద్ నుంచి తిరిగి వస్తున్న విమానంలో నుంచి నాకు ఫోన్ చేశారు. ఈ ప్రభుత్వం ప్రతిరోజూ చేసే విధంగానే, ఆయన చర్చల పురోగతి గురించి నాకు వివరంగా నివేదించారు. ఈ సందర్భంలో.. చర్చలు విఫలం గురించి తెలియజేశారు'' అని నెతన్యాహు పేర్కొన్నారు.
సుదీర్ఘ చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణం.. ఇరాన్ ఒప్పందాన్ని పాటించకపోవడమే. ఒప్పందం ప్రకారం.. ఇరాన్ వెంటనే కాల్పుల విరమణ చేయాలి, హోర్ముజ్ జలసంధిని తెరవాలి. అయితే.. ఇరాన్ ఈ నిబంధనలను అమలు చేయలేదు. అందువల్ల, అమెరికా ఈ పరిస్థితిని అంగీకరించలేక చర్చల నుంచి వెనక్కి తగ్గిందని తెలిపారు.
ఇరాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో, అమెరికా ఇరాన్పై నౌకాదళ నిర్బంధం విధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఇజ్రాయెల్ పూర్తిగా మద్దతు ఇస్తోందని నేతన్యాహు స్పష్టం చేశారు. అంతే కాకూండా.. ఇజ్రాయెల్ - అమెరికా మధ్య ఉన్న సమన్వయం ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి (Abbas Araghchi) ప్రకారం.. ఈ చర్చల సమయంలోనే నేతన్యాహు వాన్స్కు ఫోన్ చేయడం వల్ల చర్చల దృష్టి మారిపోయిందని ఆరోపించారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. అమెరికా చర్చల ద్వారా సాధించలేనిది యుద్ధం ద్వారా సాధించాలని ప్రయత్నిస్తోంది.
మొత్తం మీద.. ఈ ఘటన అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచింది. శాంతి చర్చలు విఫలమవడం వల్ల ప్రాంతీయ స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.


