చైనాతో పెట్టుకోవద్దు.. అమెరికాకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ | China Lin Jian Comments Over USA, Says Hegseth Deliberately Ignored The Call For Peace | Sakshi
Sakshi News home page

చైనాతో పెట్టుకోవద్దు.. అమెరికాకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Jun 1 2025 9:52 AM | Updated on Jun 1 2025 12:26 PM

China Lin Jian Comments Over USA

బీజింగ్‌: అమెరికా, చైనా మధ్య మరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. తాజాగా అమెరికాకు డ్రాగన్‌ చైనా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. చైనాను అదుపు చేసేందుకు తైవాన్‌ విషయంలో అమెరికా తలదూర్చడం సరికాదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇందులో మూడో దేశం జోక్యం చేసుకోవడం తగదని వార్నింగ్‌ ఇచ్చింది.

చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. తైవాన్‌ అంశాన్ని హెగ్సెత్‌ ప్రస్తావించడం కరెక్ట్‌ కాదు. చైనాను అదుపు చేసేందుకు తైవాన్‌ సమస్యను అమెరికా తీసుకురావడం సరికాదు. తైవాన్‌ అంశం చైనా అంతర్గత వ్యవహారం. ఇందులో మూడో దేశం జోక్యం మానుకోవాలి. నిప్పుతో ఆడుకోవద్దంటూ అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

ఇక, అంతకుముందు అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెగ్సెత్‌ మాట్లాడుతూ.. భౌగోళిక, సముద్ర వివాదాల పరిష్కారంతో పాటు తైవాన్‌ విషయంలో చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. భవిష్యత్తులో ఆ దేశం నుంచి వచ్చే ముప్పును.. ముఖ్యంగా తైవాన్‌పై దాని దూకుడు ప్రదర్శనను ఎదుర్కోవడానికి అమెరికా.. విదేశాల్లో తన రక్షణను బలోపేతం చేస్తోందన్నారు.

ఇదే సమయంలో తైవాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి చైనా దాని చుట్టూ సముద్రజలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలను మోహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొన్నారు. లాటిన్‌ అమెరికాపైనా చైనా కన్నేసిందనీ.. పనామా కాలువపై తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు కృషి చేస్తోందని చెప్పారు. చైనా నుంచి ఆర్థిక, సైనిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఇండో పసిఫిక్‌ ప్రాంత మిత్రదేశాలను గాలికి వదిలేయలేం. ఆయా దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలి. చైనా దూకుడు ప్రదర్శిస్తే అమెరికా దాన్ని అడ్డుకుంటుంది అని చెప్పుకొచ్చారు. దీనికి చైనా కౌంటర్‌ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement