రంగారెడ్డి కోర్టులు: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయవాది లంబ సత్యనారాయణపై సివిల్ వివాదంలో వకాల్తా తీసుకున్న కారణంగా బనాయించిన అక్రమ కేసుకు నిరసనగా న్యాయవాద సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా న్యాయవాద సంఘం అధ్యక్షుడు గుర్రం సుధాకర్రెడ్డి పిలుపు మేరకు న్యాయవాదులు రంగారెడ్డి జిల్లా కోర్టులో విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేసారు. పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ జిల్లా కోర్టు, హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా సివిల్ వివాదాల్లో కల్పించుకుంటూ న్యాయవాదులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం వివాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తెలంగాణ న్యాయవాదుల పరస్పర సహకార సంఘం సంచాలకుడు బాచిరెడ్డి శాయిరెడ్డి, ఉపాధ్యక్షుడు ఎర్రపాపయ్యవారి వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పొన్నం దేవరాజ్ గౌడ్, బార్ కౌన్సిల్ సభ్యులు అనంతసేన్ రెడ్డి, ములుగూరి ఫనీంద్ర భార్గవ్, న్యాయవాదుల జేఏసీ అధ్యక్షుడు పులిగారి గోవర్ధన్రెడ్డి, పలువురు న్యాయవాదులు ఉన్నారు.