● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
రామన్నపేట: సామాజిక అసమానతలు, అణచివేతలు, అన్యాయంపై నిరంతరం పోరాడిన మహానేత డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ అని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ ఎల్బీ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం జగ్జీవన్రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సత్యశారద ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించి జాతీయ గీతంతో ముగించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కులవివక్ష నిర్మూలనకు, సామాజిక న్యాయం కోసం జగ్జీవన్రామ్ చేసిన కృషి దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా అభివృద్ధికి అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కులాంతర వివాహం చేసుకున్న నాలుగు జంటలకు రూ.2.50 లక్షల చొప్పున విలువైన బాండ్లను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బిర్రు మహేందర్, ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు తరాల సందీప్, మాల మహానాడు ఉపాధ్యక్షుడు మన్నె బాపురావు, తెలంగాణ రాష్ట్ర అంబేడ్కర్ యువజన సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిద్ద ఎల్లయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు కందకట్ల విజయ్, అంబేడ్కర్ యువజన సంఘం నాయకుడు మహంకాళి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


