రోడ్డు ప్రమాదాల్లో భవితను కోల్పోతున్నాం..
సీపీ సన్ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: రోడ్డు నిబంధనలు పాటించకపోవడంతో దేశ భవిష్యతైన ఎంతో మంది యువతను రోడ్డు ప్రమాదాల్లో కోల్పోతున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రతీ నెల చివరి వారం నిర్వహించే ‘అరైవ్ అలైవ్ ’ రెండో విడత కార్యక్రమంలో భాగంగా సోమవారం కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో నగరంలోని వాగ్దేవి కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రతీ వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. తన థ్రిల్ కోసం వాహనదారుడు వాహనం నడపడం చాలా ప్రమాదకమని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని, ఇలాంటి చర్యల కారణంగా కుటుంబ సభ్యులు ఎంతో నష్టపోతారని సూచించారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా 7,500 మంది మృత్యువాత పడడం చాలా బాధాకరమని, ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన అవశ్యకతను వివరించాలని సీపీ సూచించారు. అనంతరం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. సెంట్రల్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీ సత్యనారయణ, ఇన్స్పెక్టర్లు వెంకన్న, సీతారెడ్డి, సుజాత, వాగ్దేవి కళాశాల ప్రిన్సిపాల్ శేషాచలం, కరస్పాడెంట్ శ్రవణ్ రెడ్డి, హరిచంద్రారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.


