గడువులోగా పనులు పూర్తి చేయండి
● తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలి
● మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: అభివృద్ధి పనులు మార్చి నెలఖారులోగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగర పరిధిలో జనరల్ ఫండ్ పనులు వేగంగా పూర్తి కావాలన్నారు. వేసవి దష్ట్యా నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా నగరంలోని అన్ని ఫిల్టర్ బెడ్లలో కెమికల్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నగరంలోని సుందరయ్య నగర్ పార్క్, కీర్తి నగర్ పార్క్, చిల్డ్రన్ పార్క్, ఉర్సు బండ్ నిమజ్జనం పాయింట్ వద్ద గల స్ట్రెచ్తో పాటు హనుమకొండ జంక్షన్ పునరుద్ధరణ పనులు సమీక్షించి వేగంగా పూర్తి చేసేందుకు సూచనలిచ్చారు. గత కౌన్సిల్ సమావేశాల్లో ఆమోదం పొంది టెండర్ పూర్తయిన ఎలక్ట్రికల్ లైట్లు ఏర్పాటు పురోగతి పనులు సమీక్షించారు. సమావేశంలో ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, మాధవీలత, మహేందర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
కాశిబుగ్గ: చేనేత కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుల కోసం దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుడు వై.శ్రీకాంత్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత కళాకారులు, చేనేత డిజైనర్లను వారి వృత్తిలో నైపుణ్యం, ప్రత్యేకతల ఆధారంగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. చేనేత కళాకారులు 2025 డిసెంబర్ 31 నాటికి 30 ఏళ్లు పైబడి ఉండాలని, పదేళ్ల అనుభవం ఉండాలన్నారు. చేనేత డిజైనర్లకు ఐదేళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. మార్చి 31లోపు దరఖాస్తులు పంపాలని సూచించారు.


