ఆర్జీలు వేగంగా పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఆయా శాఖల అధికారులు వేగంగా పరిష్కరించాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారాన్ని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు (పీఐఓలు) నిర్దిష్ట గడువులోగా అందించాలని సూచించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 165 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ వై.వి గణేశ్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, సీపీఓ సత్యనారాయణరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.


