
రైల్వే మల్టీ యూనిట్ పనులు వేగవంతం చేయాలి
కాజీపేట రూరల్: కాజీపేట మండలం అయోధ్యపురంలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మల్టీ యూనిట్ నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) ఆర్.గోపాలకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కాజీపేట రైల్వే మల్టీ యూనిట్ నిర్మాణ పనుల్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. రైల్వే మల్టిపుల్ యూనిట్ లేఔట్ను పరిశీలించి కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణ పనులు సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు. అయోధ్యపురం భూనిర్వాసితులు డీఆర్ఎం గోపాలకృష్ణన్కు వినతి పత్రం అందించారు. అనంతరం కాజీపేట యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ సైడింగ్, కాజీపేట ఎలక్ట్రిక్ లోకో షెడ్డుకు వెళ్లి అక్కడ యాంటీ కొలెజన్ డివైజ్ లోకో సిస్టంతో పాటు ఇతర విభాగాలను, డీజిల్ లోకోషెడ్డులో తనిఖీలు చేపట్టారు. వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ టెస్టింగ్, రూంను ప్రారంభించి, షెడ్డులో వేస్టేజ్ మెటీరియల్స్తో రైల్వే టెక్నీషియన్లు చేసిన స్క్రాప్ టు ఆర్ట్ గ్యాలరీని తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. డీజిల్ షెడ్డులో మొక్క నాటారు. అధికారులతో మాట్లాడి షెడ్డు అభివృద్ధి, సమస్యలు తెలుసుకున్నారు. కాజీపేట జంక్షన్లో జరుగుతున్న అమృత్ భారత్ అభివృద్ధి పనుల్ని తనిఖీ చేసి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డీర్ఎం స్పిక్లో సికింద్రాబాద్కు బయల్దేరి వెళ్లారు. డీఆర్ఎం వెంట సికింద్రాబాద్ సీనియర్ డీఓఎం సురేశ్రెడ్డి, సికింద్రాబాద్ కో–ఆర్డినేషన్ కె.రవీంద్రనాథ్, డీఈఎన్ సెంట్రల్ ప్రంజల్, ఆర్వీఎన్ఎల్ జీజీఎం మురళీకృష్ణ, పవర్మెక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఏజీఎం సీహెచ్.కృష్ణ, పీఎంసీ శివరామకృష్ణ, కాజీపేట సీనియర్ డీఎంఈ వెంకటకుమార్, కాజీపేట సీనియర్ డీఈఈ సూర్యనారాయణ, ఆర్పీఎఫ్ సీఐ చటర్జీ, స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, రైల్వే సూపర్వైజర్లు ఉన్నారు.
సికింద్రాబాద్ డీఆర్ఎం గోపాలకృష్ణన్
అభివృద్ధి పనుల తనిఖీ
డీజిల్ షెడ్డులో
వీసీబీ రూం ప్రారంభం