
కనీస వసతులు కల్పించండి
వరంగల్ అర్బన్ : ‘మేడం.. ఇంటి, చెత్త, నల్లా పన్నులు చెల్లిస్తున్నాం.. కాలనీల్లో కనీస వసతులు కల్పించాలి’ అని పలువురు గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్కి విజ్ఞప్తి చేశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో వివిధ కాలనీల ప్రజల నుంచి 99 వినతులు స్వీకరించారు. ఇంజనీరింగ్ విభాగానికి–35, అతిక్రమణలపై టౌన్ ప్లానింగ్కు–35, ప్రజారోగ్యానికి–13, పన్నుల విభాగానికి–12, తాగునీటి సరఫరా–3, ఉద్యాన వన విభాగానికి ఒకటి దరఖాస్తు అందినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్, టీఓ రామకృష్ణ, ఏసీపీలు, ఈఈలు పాల్గొన్నారు.
గ్రీవెన్స్ వెలవెల..
బల్దియాలోని గ్రీవెన్ సెల్ సోమవారం వెలవెలబోయిుంది. స్టడీ టూర్ నేపథ్యంలో పాలక వర్గంతోపాటు క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షించేందుకు గ్రేటర్ వరంగల్ అధికారులు, సిబ్బంది వెళ్లడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.
ఫిర్యాదుల్లో కొన్ని..
● 42వ డివిజన్ తెలంగాణ కాలనీలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి పైపులైన్లు నిర్మించాలని కె.రాజ్కుమార్ తదితరులు కోరారు.
● 16వ డివిజన్ గరీబ్ నగర్ కాలనీల్లో విద్యుత్ స్తంభాలు లేవని, ఉన్న చోట్ల లైట్లు వెలగడం లేదని రాత్రివేళల్లో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు దరఖాస్తు ఇచ్చారు.
● 15వ డివిజన్ గొర్రెకుంటలో విద్యుత్ స్తంభం తొలగించకుండా సీసీ రోడ్డును నిర్మించారని ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని ఎంజెఎస్, డీఎస్పీ నాయకులు విజ్ఞప్తి చేశారు.
● 29వ డివిజన్ అంబేడ్కర్ నగర్ కాలనీలో పెద్ద మోరీ వద్ద గ్రంథాలయం, కూల్చివేసిన స్థానంలో బాబు జగ్జీవన్ రావు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు.
● 65వ డివిజన్ దేవన్నపేటలో గ్రామపంచాయతీ పక్కన ఆర్టీసీ బస్స్టాండ్కు సమీపంలోని స్థలాన్ని విస్తరించి నూతనంగా నిర్మించాలని పలువురు కోరారు.
● వరంగల్ ప్రాంతంలోని ఆరెకటికలకు కమ్యూనిటీ హాల్ స్థలం లేనందున లక్ష్మీపురంలో స్థలాన్ని కేటాయించాలని జిల్లా కమిటీ నాయకులు విన్నవించారు.
● 40వ డివిజన్ కరీమాబాద్ చెట్ల వారీ గడ్డకు సెప్టిక్ ట్యాంక్లు లేకుండా డ్రెయినేజీల్లోకి వ్యర్థాలను వదులుతున్నారని దుర్వాసన, రోగాల బారిన పడుతున్నామని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
● 42వ డివిజన్ రంగశాయిపేటలో ఖబరస్థాన్కు ప్రహరీ నిర్మించాలని, పెద్ద మోరీలో వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
● 20వ డివిజన్ కాశిబుగ్గ, గుండ్ల సింగారంలో కోతులు, కుక్కల సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని చర్యలు తీసుకోవాలని బీజేపీ డివిజన్ అధ్యక్షుడు మడిపల్లి నాగరాజ్ గౌడ్ ఫిర్యాదు చేశారు.
● బల్దియా కార్మికులకు సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా ఈనెల 25లోగా వేతనాలని పంపిణీ చేయాలని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్, ఔట్ సోర్సింగ్ యూనియన్ నాయకులు వేర్వేరుగా విజ్ఞప్తి చేశారు.
● వరంగల్ శివసాయి కూడా లే అవుట్ డీపీ 22/2004లో 40ఫీట్ల రోడ్డును ఆక్రమిస్తున్నారని చర్యలు తీసుకోవాలని వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు.
బల్దియా గ్రీవెన్స్కు 99 ఫిర్యాదులు
వినతులు స్వీకరించిన కమిషనర్ చాహత్ బాజ్పాయ్