
సీడ్.. ఫ్రాడ్
● యాసంగిలో ములుగు జిల్లా వెంకటాపురం, కన్నాయిగూడెం, వాజేడు, మండలాల్లోని 55 గ్రామాల్లో పేరొందిన కంపెనీలవని నమ్మిన రైతులు.. 1,370 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. అవి నకిలీవి కావడంతో 618 మంది రైతులు నష్టపోగా, అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదయ్యాయి.
● మార్చి నెలాఖరులో హనుమకొండ జిల్లాలో రూ.78.63 లక్షల విలువైన నాసిరకం పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాసభ్యులు గతంలో కూడా నాసిరకం పత్తి, మొక్కజొన్న విత్తనాలు విక్రయించినట్లు కేసులున్నాయి.
● తాజాగా వరంగల్ టాస్క్ఫోర్స్, గీసుకొండ, పరకాల పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురిని అరెస్టు చేసి రూ.63.62 లక్షల విలువ చేసే 166 కిలోల నాసిరకం విత్తనాలు, 800 లీటర్ల గడ్డిమందు, నకిలీ పురుగుల మందు తయారీకి అవసరమైన సామగ్రి, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
సాక్షిప్రతినిధి, వరంగల్:
ప్రస్తుత వానాకాలం సీజన్కు నాసిరకం పత్తి విత్తనాలు పోటెత్తుతున్నాయి. ఓ వైపు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలనుంచి భారీగా రవాణా అవుతుండగా.. మరోవైపు ముఠాలుగా ఏర్పడిన కొందరు ఉమ్మడి వరంగల్వాసులు ఈ ‘నకిలీ’లను మార్కెట్లో విక్రయిస్తున్నారు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలను కేంద్రాలుగా చేసుకుని ఈ దందా సాగిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ముందు జాగ్రత్తగా టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో బయటపడిన నాసిరకం విత్తనాలే ఇందుకు ఉదాహరణ.
వరి తర్వాత పత్తి వైపే రైతుల మొగ్గు..
ఉమ్మడి వరంగల్లో వరి తర్వాత రైతులు పత్తి సాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. గత వానాకాలంలో 15,83,692 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. ఇందులో 8.72 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేయగా 6.17 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సుమారుగా 1.14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, శనగ, పెసర తదితర పంటలు సాగయ్యాయి. గత వానాకాలం సాగు విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకున్న వ్యవసాయశాఖ.. ఈ సీజన్లో 15.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని, ఇందులో 9.02 లక్షల ఎకరాల్లో వరి, 5.67 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు వేస్తారని అంచనా వేసింది. పత్తి వర్షాధార పంట కావడంతో ఈ నెల రెండు, మూడు వారాల్లో విత్తుకునేందుకు 20 రోజుల ముందునుంచే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఈమేరకు 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కోసం ఎకరానికి రెండు బస్తాల చొప్పున సుమారు 11,34,716 ప్యాకెట్లు అవసరం. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా బీటీ–2 రకం వాడకంలో ఉండగా, ఈసారి బీటీ–3 పేరిట వ్యాపారులు నాసిరకం విత్తనాల్ని విక్రయిస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు విత్తనాల కొనుగోలు విష యంలో ఏటూ తేల్చుకోలేక పోతున్నారు.
బ్లాక్ మార్కెట్లో విత్తనాలు..
రూ.400 వరకు అదనం..
ఉమ్మడి జిల్లాలో ఈసారి 5,67,358 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేసిన వ్యవసాయశాఖ అధికారులు.. ఆమేరకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. కానీ.. ఓవైపు నాసిరకం బెడద.. మరోవైపు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నా యి. ఎకరానికి 475 గ్రాములున్న విత్తన ప్యాకెట్లు రెండు అవసరం కాగా.. ఉమ్మడి జిల్లాకు 11.35 లక్షల విత్తన ప్యాకెట్లు కావాల్సి ఉంది. ఈ మేరకు నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్తున్నా... కొందరు డీలర్లు, వ్యాపారులు మాత్రం సరిపడా రాలేదంటున్నారు. బీటీ–2 రకాలకు మార్కెట్లో డిమాండ్ ఉండగా.. ఇప్పటి నుంచే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కాగా.. బీటీ–2 రకాలకు చెందిన ఒక్కో ప్యాకెట్ను రూ.901కు విక్రయించాల్సిన వ్యాపారులు లేవు.. లేవంటూ రూ.1,350ల నుంచి రూ.1,450ల వరకు అమ్ముతున్నట్లు చెబుతున్నారు. వర్షాలు పడితే ఆ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
నాసిరకం విత్తనాలు,
మందులు విక్రయిస్తే కఠిన చర్యలు
నాసిరకం విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైన వ్యాపారస్తులు, సంస్థలు, వ్యక్తులు రైతన్నను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తాం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి టీమ్లను రంగంలోకి దింపాం. నకిలీల సమాచారం తెలిస్తే తక్షణమే మాకు అందించాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం.
– సన్ ప్రీత్సింగ్, పోలీస్ కమిషనర్
రైతుల మెడపై నాసిరకం విత్తనాల కత్తి
సీజన్ ఆరంభం నుంచే దందా
పత్తి విత్తనాల కృత్రిమ కొరత...
తప్పని అధిక ధరల మోత
పత్తి, వరి విత్తనాల్లోనే నకిలీ ఎక్కువ.. ఇటీవల పట్టుకున్న పోలీసులు
నిఘా పెంచాలని కోరుతున్న రైతులు
జిల్లాల వారీగా పత్తిసాగు, విత్తనాల అంచనా
జిల్లా సాగు అంచనా అవసరమయ్యే
(ఎకరాల్లో..) విత్తన ప్యాకెట్లు
హనుమకొండ 85,000 1,70,000
వరంగల్ 1,22,358 2,44,716
మహబూబాబాద్ 84,070 1,68,140
భూపాలపల్లి 1,01,500 2,03,000
జనగామ 1,45,000 2,90,000
ములుగు 29,430 58,860

సీడ్.. ఫ్రాడ్