
పట్టపగలే మున్సిపల్ స్థలం కబ్జా!
● రూ.నాలుగు కోట్ల విలువైన భూమి ఆక్రమణ
● పట్టించుకోని గ్రేటర్ వరంగల్ అధికారులు
వరంగల్ అర్బన్: వరంగల్ కాశిబుగ్గలోని ఎల్బీనగర్ భారత్ గ్యాస్ కేంద్రం దగ్గర సర్వే నంబర్ 199, బై7లో ఉన్న మున్సిపల్ స్థలాన్ని(అసైన్డ్) కొందరు కబ్జా చేసి చుట్టు ప్రహరీ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కబ్జాదారులు పట్టపగలే కిరాయి మనుషులను పెట్టి రూ.నాలుగు కోట్ల విలువైన 1800 గజాల మున్సిపల్ స్థలం చుట్టూ గోడ నిర్మించడానికి గుంతలు తవ్వారు. కబ్జా వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో పేరొందిన ఓ సబ్రిజిస్ట్రార్, ఓ హోటల్ యజమాని, మరో ఇద్దరు కార్పొరేటర్ల ప్రమేయం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇదే అసైన్డ్ భూమిలో పేద ప్రజలకు అప్పటి ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్బాబు పట్టాలు ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మున్సిపల్ స్థలాలను పట్టపగలే కబ్జా చేస్తున్నా అడిగే నాథుడు లేడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కబ్జాదారులపై చర్యలు తీసుకుని మున్సిపల్ స్థలాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు.