
తహసీల్దార్లకు బదిలీ ఫీవర్!
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో తహసీల్దార్లకు మరోసారి బదిలీ ఫీవర్ పట్టుకుంది. కొద్దిరోజుల క్రితమే రాష్ట్రస్థాయిలో తహసీల్దార్ల బదిలీలు చేసిన ప్రభుత్వం ఇటీవల కేబినెట్లో ఈ విషయంపై మాట్లాడింది. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లు సొంత జిల్లాలకు వెళ్లాల్సి ఉంటుందని నిర్ణయించింది. దీంతో రాష్ట్రస్థాయిలో మరోసారి భారీగా తహసీల్దార్ల బదిలీలు ఉంటాయన్న చర్చ అధికారుల్లో సాగుతోంది. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితమే జరిగిన బదిలీల్లో జిల్లాకు కొత్తగా నలుగురు తహసీల్దార్లు రాగా, మరికొందరు హనుమకొండనుంచి ఇతర జిల్లాలకు వెళ్లారు. జిల్లాకు వచ్చిన వాళ్లకు కలెక్టర్ ప్రావీణ్య పోస్టింగ్లు ఇచ్చారు. దీంతో అంతా సర్ద్దుమణిగింది అనుకున్న సమయంలో మరోసారి తహసీల్దార్లపై బదిలీల పిడుగు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎవరికివారు ఈ బదిలీ గండంనుంచి బయటపడేందుకు తమవంతుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఎన్నికల సమయంలో వచ్చిన వారు..
గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లు చాలావరకు ఇక్కడే ఉన్నారు. ఇటీవల బదిలీల్లో ఒకరిద్దరు మారారు. ఉద్యోగ సంఘాలు రాష్ట్రస్థాయిలో ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశాయి. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను తిరిగి తమ సొంత జిల్లాలకు పంపించాలని కోరాయి. వారి అభ్యర్థనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో వచ్చిన వారు తిరిగి వెళ్లక తప్పదనే వినిపిస్తోంది. అదే జరిగితే ప్రస్తుతం హనుమకొండ జిల్లాలోని వేలేరు, ధర్మసాగర్, కాజీపేట, ఎల్కతుర్తి తహసీల్దార్లతోపాటు ఒక డీఈఓ, కలెక్టరేట్లో ఒక సూపరింటెండెంట్ ఈ బదిలీ పరిధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గత ఎన్నికల సమయంలో జిల్లా నుంచి వెళ్లిన వారిలో తహసీల్దార్లు పాక రాజ్కుమార్, రియాజ్ మహేందర్, బండి నాగేశ్వరరావు, పూజారి కిరణ్ కుమార్, తదితరులు తిరిగి జిల్లాకు వచ్చే అవకాశం ఉంటుంది. హనుమకొండ జిల్లాకు వచ్చేవారు ఉత్సాహంగా ఉన్నప్పటికీ ఇక్కడినుంచి వెళ్లే వారికి కాస్త అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. బదిలీలు తప్పించుకునేందుకు ఇక్కడివారు ఎంత ప్రయత్నం చేస్తున్నారో, రావాల్సిన వారు రెట్టింపు ప్రయత్నిస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. తహసీల్దార్ల బదిలీలు పూర్తయి జిల్లాలు కేటాయిస్తే వచ్చిన వారికి పోస్టింగ్స్ ఇచ్చే క్రమంలో మరోసారి జిల్లా స్థాయిలో తహసీల్దార్లకు స్థానచలనం కలిగే అవకాశం ఉంటుంది.
బదిలీ భయంతోనే శ్రీపాల్ మృతి?
ఇటీవల హనుమకొండ తహసీల్దార్ శ్రీపాల్ రెడ్డి అకాల మరణం ఉద్యోగ వర్గాల్లో కలకలంరేపింది. బదిలీల విషయంపై పదేపదే ఆలోచించి ఆయన కొంత ఆందోళనకు గురైనట్లు సన్నిహితులు చెబు తున్నారు. ఇప్పటికే ప్రమాదవశాత్తు కాలు విరిగి ఇబ్బందులు పడుతున్న శ్రీపాల్రెడ్డి మరోసారి బదిలీ పేరుతో దూర ప్రాంతానికి వెళ్లడం ఎలా? అని మదనపడుతుండేవాడని సమాచారం.
హనుమకొండ జిల్లా నుంచి ఏడుగురు బయటకి.. వచ్చేవాళ్లు ఐదుగురు
బదిలీ గండం తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు