
ప్రజాస్వామ్యంపై ఏపీ ప్రభుత్వం దాడి
హన్మకొండ అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులు, సాక్షి మీడియా కార్యాలయాలపై పాశవికంగా దాడులు చేస్తూ.. అక్రమ కేసులు నమోదు చేయడాన్ని హనుమకొండ జిల్లా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలపై దాడులు ప్రజాస్వామ్యంపై దాడిగా వారు అభివర్ణించారు. ఏపీ ప్రభుత్వం హామీలను అమలు చేయలేక ప్రజలను పక్కదారి పట్టించేందుకు సాక్షి జర్నలిస్టులు, సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు, అక్రమ కేసులకు పాల్పడుతోందన్నారు. ఇవి పునరావృతమైతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు సీనియర్ జర్నలిస్టులు, మేధావులు, ప్రజాసంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయనను భేషరతుగా విడుదల చేయాలని, పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈనిరసనలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, సాక్షి బ్యూరో ఇన్చార్జ్ గడ్డం రాజిరెడ్డి, ఎడిషన్ ఇన్చార్జ్ వర్ధెల్లి లింగయ్య, వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ వాంకే శ్రీనివాస్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు తోట సుధాకర్, టీవీ.రాజు, బొక్క దయాసాగర్, బొల్లారపు సదయ్య, పొడిశెట్టి విష్ణువర్ధన్, గాడిపెల్లి మధు, వల్లాల వెంకటరమణ, కంకణాల సంతోశ్, నల్లాల బుచ్చిరెడ్డి, అంతడుపుల శ్రీనివాస్, ఊటుకూరు సాయిరాం, నరేశ్, బత్తిని రాజేందర్గౌడ్, కొల్లా కృష్ణ్ణ కుమార్రెడ్డి, యాంసాని శ్రీనివాస్, దామెర రాజేందర్, కొలనుపాక కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
కొమ్మినేని అరెస్ట్..
సాక్షి కార్యాలయాలపై దాడులు
నిరసిస్తూ జర్నలిస్టు సంఘాల ఆందోళన
హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన