
‘క్రూ’ వర్కింగ్ సిస్టంపై చిన్నచూపు
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయ కేంద్రంగా పని చేస్తున్న క్రూ (లోకోపైలెట్, అసిస్టెంట్ లోకోపైలెట్)లను మెయిన్లైన్లో కాకుండా బొగ్గు, సిమెంట్ సైడిండ్ పాయింట్లకే పరిమితం చేసి పని చేయిస్తున్నారని రన్నింగ్స్టాఫ్ రైల్వే కార్మికులు ఆరోపిస్తున్నారు. కాజీపేట క్రూ డిపో ఏర్పాటు చరిత్రలో ఇప్పటి వరకు లోకోపైలెట్లు, అసిస్టెంట్ లోకోపైలెట్లు మెయిన్లైన్లో కాజీపేట–బల్లార్షా వరకు అప్ అండ్ డౌన్లో విధులు నిర్వర్తించేవారని వారు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే యంత్రాంగం అనాలోచితంగా కాజీపేట క్రూ డిపోను చిన్నచూపు చూస్తూ క్రూ వర్కింగ్ సిస్టం నిర్వీర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి కొంత సిబ్బందిని (కాజీపేట క్రూలు) మంచిర్యాల, మందమర్రి, రామగుండం, బెల్లంపల్లిలో సైడింగ్లకు పరిమితం చేసి వర్కింగ్ చేయిస్తున్నారని, ఖాళీ వ్యాగన్లతో గూడ్స్ను తీసుకెళ్లి లోడింగ్ చేయించడం, అక్కడ ఉండి మళ్లీ లోడింగ్ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కోచింగ్ క్రూ లింక్లను కూడా విడదీస్తూ గూడ్స్ డ్రైవర్ల వర్కింగ్ మాదిరి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ విధానంలో కోచింగ్ క్రూలను బుక్ చేస్తున్నారని రన్నింగ్స్టాఫ్ పేర్కొంటున్నారు. హెడ్క్వార్టర్స్, ఔట్ స్టేషన్లలో ఈ విధానం పాటించడం వల్ల హెచ్ఓఈఆర్ (అవర్స్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ రూల్స్) నిబంధనలు ఉల్లంఘనకు గురై ప్రయాణికులకు భద్రత లేకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు. దీనిపై ఇప్పటికై నా సికింద్రాబాద్ రైల్వే యంత్రాంగం స్పందించి కాజీపేట క్రూ డిపో, లోకోపైలెట్ల, అసిస్టెంట్ లోకోపైట్ల ప్రాధాన్యం తగ్గించొద్దని రైల్వే నాయకులు, రన్నింగ్స్టాఫ్ కార్మికులు సోమవారం కోరారు. కాగా, ఇటీవల వరుసగా ప్రజాప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే అధికారులతో ఏదో ఒక విషయంపై చర్చిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం క్రూల పనితీరుపై లోకోపైలెట్, అసిస్టెంట్ లోకోపైలెట్లు ఆరోపణలు చేయడం గమనార్హం.
సైడింగ్ పాయింట్లకే
కాజీపేట రైల్వే క్రూల పరిమితం
ఆందోళనలో రన్నింగ్ స్టాఫ్ కార్మికులు