
నేటి నుంచి ‘భద్రకాళి’ కల్యాణ బ్రహ్మోత్సవాలు షురూ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో ఏప్రిల్ 29 నుంచి మే 10 వరకు భద్రకాళీభద్రేశ్వరస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం అంకురార్పణ పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈఓ శేషుభారతి తెలిపారు. సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం శేషుభారతి మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల కోసం, తదితర ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కల్యాణోత్సవం సందర్భంగా ఒక్కోరోజు వివిధ కుల సంఘాల వారు అమ్మవారి సేవల్లో పాల్గొనడానికి ముందుకు వచ్చినట్లు ఆరోజున వారి నిర్వహణలోనే పూజా కార్యక్రమాలు జరుగుతాయని ప్రతీ రోజు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 7 గంటలకు అత్యంత వైభవంగా వాహన సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే 2న జరిగే కల్యాణోత్సవంలో పాల్గొనాలనుకునే భక్తులు రూ.516 చెల్లించి రశీదు పొందాలని వారికి ప్రసాదం, అక్షింతలు, శేష వస్త్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాల్ని విజయవంతం చేయాలని ఆలయ అర్చకులు భద్రకాళి శేషు కోరారు. సమావేశంలో ఆలయ సూపరింటెండెంట్ అద్దంకి విజయ్కుమార్, ముఖ్య అర్చకులు చెప్పెల నాగరాజుశర్మ, దేవాలయ సీనియర్ అసిస్టెంట్ కూచన హరినాథ్. సిబ్బంది చింతశ్యాంసుందర్, నాగులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ
మే 2న భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణం